జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘వైనాట్ కుప్పం?’ అంటూ కాలర్ ఎగరేసి, చంద్రబాబు నాయుడుకి ఆయన సొంత నియోజకవర్గంలోనే చెక్ పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీ ముఖ్య నేతల ఆర్ధిక మూలాలను దెబ్బ తీసి పార్టీని బలహీన పరచాలని కుట్రలు చేశారు. అవేవీ జగన్ తప్పుగా భావించలేదు.
కానీ తన కుటుంబానికి, వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న కడపలో టీడీపీ మహానాడు నిర్వహిస్తుండటం, అక్కడి నుంచే తనని, తన పార్టీని, పాలనని టీడీపీ నేతలందరూ విమర్శిస్తుండటం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
బహుశః అందుకే పులివెందులలో పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేసి టీడీపీ జెండాలు, ఫ్లెక్సీ బ్యానర్లు పీకేయించారు. అప్పటికీ కడుపు మంట చల్లారకపోవడంతో అందుబాటులో ఉన్న కొంతమంది వైసీపీ నేతలను పోగేసి తాడేపల్లి ప్యాలస్లో సమావేశం పేరుతో టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని, మహానాడులో చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలందరూ డ్రామాలు చేస్తున్నారంటూ విమర్శించారు.
చేతిలో స్క్రిప్ట్ లేనిదే ఒక్క ముక్క మాట్లాడలేని జగన్, అనర్గళంగా మాట్లాడే సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రులు, టీడీపీ నేతల భాషని కూడా ఎద్దేవా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
కడపలో మహానాడు పెట్టడం గొప్ప కాదు.. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలుచేసి చూపమని జగన్ సవాల్ విసిరారు.
ప్రతీరోజూ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తేనే జగన్కు కాస్త మనశాంతి లభిస్తుంది. కనుక వెంటనే తన పాలన ఎంత అద్భుతంగా సాగిందో వర్ణించి చెప్పుకొని, తాను అమలుచేసిన సంక్షేమ పధకాల జాబితాని మరోసారి గడగడ చదివి వినిపించి సంతోషపడుతుంటారు. ఇవాళ్ళ కూడా జగన్ ఇదే చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సిఎం చంద్రబాబు నాయుడు ప్రజల మద్యనే ఉంటున్నారు. కానీ వైసీపీ ఎన్నికలలో ఓడిపోయి ఏడాది కావస్తున్నా జగన్ ప్రాణ భయంతో ప్రజల మద్యకు రావడం లేదు. గడప దాటాని జగన్, రాష్ట్రం, ప్రజల గురించి మాట్లాడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది.
ఇప్పటికే పలు హామీలను అమలుచేసిన సిఎం చంద్రబాబు నాయుడు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్లు ప్రకటించారు.
కానీ ఈరోజు జగన్ మాట్లాడిన మాటలు విన్నప్పుడు, ఆయన సొంత మీడియా, చుట్టూ ఉన్న కోటరీ చెప్పే మాటలు విని స్పందిస్తున్నారు తప్ప బయట ఏం జరుగుతుందో తెలియదేమో?అని అనుమానం కలుగుతోంది.
జగన్ బయట తిరిగినప్పుడే 175కి 175 సీట్లు మనకే వస్తాయనే భ్రమ పడేవారు. ఇప్పుడు ప్యాలస్లో కూర్చొని ఏదేదో పగటి కలలు కంటున్నారు. ఆయన ఒంటరిగా ప్యాలస్లో కూర్చొని పగటి కలలు కంటుంటే టీడీపీకి మాత్రం అభ్యంతరం ఉంటుందా?




