ఉగ్రవాదులకు శిక్షణ రక్షణ కల్పిస్తున్న పాకిస్తాన్ అమెరికా-ఇరాన్ యుద్ధం ఆపేందుకు చొరవ తీసుకుంటుంటే, అమెరికా-ఇరాన్ దేశాలతో సత్సంబంధాలున్న ప్రధాని మోడీ ఎందుకు చొరవ తీసుకోలేదు?ఎందుకు మధ్యవర్తిత్వం చేసి ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు?ఎందుకు దూరంగా, మౌనంగా ఉండిపోయారు?అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
“అవును నిజమేగా! ఎందువల్ల?” అని మిగిలినవారికి కూడా సందేహం కలుగవచ్చు. కానీ మధ్యవర్తిత్వం చేయాలంటే ఇరు పక్షాలను ఒప్పించగలమనే నమ్మకం ఉండాలి.
పూటకో మాట, రోజుకో మాట మాట్లాడే ట్రంప్ లాంటి వ్యక్తులను ఒప్పించడం చాలా కష్టం. ఒకవేళ ఒప్పించినా ట్రంప్ ఆ మాటకు కట్టుబడి ఉంటారనే నమ్మకం లేదు.
పాక్ మధ్యవర్తిత్వంతో రెండు వారాలు కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్, వెంటనే ఇజ్రాయెల్తో కలిసి లెబనాన్ మీద భీకర దాడులు చేయిస్తుండటమే ఇందుకు తాజా నిదర్శనం. దీంతో శాంతి ఒప్పందాన్ని ట్రంప్ చించి చెత్తబుట్టలో పడేసినట్లయింది.
ఏమంటే, లెబనాన్పై దాడి చేయరాదనే షరతు లేదని కనుక దాడులు చేస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్ సమర్ధించుకుంటుంటే, లెబనాన్పై దాడి చేయరాదనే తమ షరతుని అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించి ఒప్పందానికి భంగం కలిగించాయని ఇరాన్ వాదిస్తోంది.
శాంతి ఒప్పందంలో ఇలాంటి గందరగోళం ఎందుకు ఏర్పడిందంటే, పాకిస్తాన్ ఆ షరతుని దాచిపెట్టి రెండు దేశాలను ఒప్పించడం వల్లనే!
తమ షరతులకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా, అది ఒప్పుకుందని ఇరాన్ భావించడం వల్లనే రెండు వారాల గడువుకి అంగీకరించాయి.
కానీ ఎలాగైనా ఈ యుద్ధం ఆపించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకోవాలనే తాపత్రయంతో పాకిస్తాన్ కొన్ని షరతులను దాచిపెట్టడం వలన మళ్ళీ కథ మొదటికొచ్చింది.
లెబనాన్ మీద దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇరాన్ హెచ్చరిస్తే, ఇరాన్ ఒక్క తూటా పేల్చినా శాంతి ఒప్పందం ఉల్లంఘించినట్లే భావించి ఇరాన్ని తుడిచి పెట్టేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ భారత్ మధ్యవర్తిత్వం వహించి పూర్తి పారదర్శకంగా శాంతి ఒప్పందం కుదిర్చినా, యుద్ధోన్మాదంతో ఉన్న ట్రంప్, నెతన్యాహులను ఎక్కువ రోజులు ఆపలేదు. ఇలాగే ఏదో ఓ సాకుతో మళ్ళీ యుద్ధం మొదలుపెట్టక మానరు.
ఇప్పుడు పాకిస్తాన్ పరువు పోయినట్లే అప్పుడు భారత్ పరువు కూడా పోయేది. కనుక ఈ వ్యవహారంలో భారత్ వేలు పెట్టకుండా దూరంగా ఉండటం చాలా మంచి నిర్ణయమని స్పష్టమైంది.






