గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి అంతమంది అభ్యర్ధులా… ఎందుకు?

CM KCR

తెలంగాణలో కేసీఆర్‌ ఎక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనను ఓడించడం అసంభవమే. కానీ ఈసారి ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే ఓడిస్తానని శపధం చేశారు ఒకప్పటి ఆయన ఉద్యమ సహచరుడు. ఆయన మంత్రివర్గంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌.

అలాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌ని కామారెడ్డిలో ఓడిస్తానంటూ శపధం చేసి నామినేషన్ వేశారు. వీరిద్దరూ కేసీఆర్‌ బాధితులే. ఆయన చేతిలో తీవ్ర అవమానాలకు గురైనవారే. ఇద్దరూ రాజకీయాలలో కొమ్ములు తిరిగినవారే కనుక వారు కేసీఆర్‌పై పోటీ చేయడం పెద్ద విశేషమేమీ కాదు.

ADVERTISEMENT

కానీ కేసీఆర్‌ బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు కూడా ఈసారి గజ్వేల్‌లో నామినేషన్స్‌ వేశారు. ఒకరో ఇద్దరో కారు ఏకంగా 145 మంది 154 నామినేషన్స్‌ వేశారు. అలాగే కామారెడ్డిలో కూడా 92 మంది 104 నామినేషన్స్‌ వేశారు.

గజ్వేల్‌లో నామినేషన్స్‌ వేసిన వారిలో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి నిర్వాసితులే వందమందికి పైగా ఉన్నారు. అమరవీరుల కుటుంబాలకు చెందినవారు మరో 30మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిలో నిరుద్యోగులు, రైతులు ఉన్నారు.

గత ఎన్నికలలో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఇలాంటి సమస్య వలననే ఓడిపోయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయనందుకు నిరసనగా వందల మంది రైతులు నామినేషన్స్‌ వేశారు. దాంతో అభ్యర్ధుల జాబితా పెరిగి ఓటర్లలో గందరగోళం ఏర్పడటంతో ఆమె ఓడిపోయారు.

బిఆర్ఎస్ పార్టీకి అది చాలా చేదు అనుభవంగా మిగిలిపోయింది. కనుక ఈసారి గజ్వేల్‌లో కేసీఆర్‌కు కూడా మళ్ళీ అటువంటి సమస్యే ఎదురవడంతో బిఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలను వారి వద్దకు పంపించి బుజ్జగించి నామినేషన్స్‌ ఉపసంహరించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సోమవారం నామినేషన్స్‌ పరిశీలన తర్వాత ఈ నెల 15వరకు వాటి ఉపసంహరణకు గడువు ఉంటుంది. కనుక ఆ తర్వాత కేసీఆర్‌ మీద ఎంతమంది పోటీ చేయబోతున్నారో స్పష్టమవుతుంది.

తెలంగాణలో 119 స్థానాలకు 4,798 మంది 5,716 నామినేషన్స్‌ వేసిన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్‌ 3న ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు వెలువడతాయి.

ADVERTISEMENT
Latest Stories