కుదిరితే కూటమిలో లేకుంటే కాపులలో చిచ్చు… తగ్గేదేలే!

Pawan Kalyan, Vijay Politics Trigger Debate on Alliances

రాజమౌళి-మహేష్ బాబులా టీడీపి, జనసేనలది ‘డెడ్లీ కాంబినేషన్‌’ అని మొట్ట మొదట పసిగట్టిన ఏకైక వ్యక్తి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే.

కనుక నాడు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌-చంద్రబాబు నాయుడు చేతులు కలపకుండా అడ్డుకునేందుకు సామధనభేదదందోపాయాలన్నీ ప్రయోగించారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఆ రెండు పార్టీలను జగన్‌ స్వయంగా కలిపారు. జగన్‌ భయాలు నిజమయ్యాయి.

ADVERTISEMENT

కానీ జగన్‌ చాలా ఆశావాది. ఆయన మాట తప్పుతారు. మడమ తిప్పుతారు కానీ పట్టువదలరు. విక్రమార్కుడు లాంటివారే.

కనుక అనేక కాంబినేషన్‌లలో చిచ్చుకి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మొదట నారా లోకేష్‌-పవన్ కళ్యాణ్‌ మద్య కుదరక పోవడంతో చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్‌ మద్య అదీ ఫలించకపోవడంతో టీడీపి-జనసేనల మద్య చిచ్చు రగిలించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అలాగే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు దొరికిన ప్రతీ చిన్న అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూనే ఉన్నారు.

ఒకవేళ ఎలాంటి అవకాశం దొరక్కపోతే ‘టైగర్ రాంబాబు’ వంటి వారిని కాపు నాయకులుగా సృష్టించి ప్రమోట్ చేసేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు.

వైసీపీ అధినేత మనసులో ఆలోచనలకి, అభిప్రాయాలకు, కోర్కెలకు అద్దం పట్టేందుకు సొంత మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

ఈరోజు ఆన్‌లైన్‌ సంచికలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని, మెల్లగా ఆ పధకాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఓ ఆర్టికల్ వేసింది.

డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం అందుకేనని కనిపెట్టి చెప్పింది. కానీ పెట్రోల్, డీజిల్‌ భారం తగ్గించుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు రైల్వేశాఖతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలు, ప్రజలు క్రమంగా విద్యుత్ వాహనాలకు మారుతున్న సంగతి చెప్పలేదు.

‘పవన్ కళ్యాణ్‌ నయా ఊసరవెల్లి’ అంటూ వేసిన మరో ఆర్టికల్లో తమిళనాడు తాజా రాజకీయాలను ప్రస్తావిస్తూ వాటిపై పవన్ కళ్యాణ్‌ స్పందించిన తీరుని తప్పు పట్టింది.

‘ఊర్లో పెళ్ళికి…’ అంటూ అయన జనసైనికులను ఉద్దేశ్యించి అవమానకరంగా మాట్లాడితే వారు చప్పట్లు కొట్టారని ఆక్షేపించింది.

పవన్ కళ్యాణ్‌ మొదటి నుంచి మాట మార్చడం, అబద్దాలు చెప్పడం అలవాటే అని విమర్శించింది. పవన్ కళ్యాణ్‌ పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపి, బిజేపిలకు మద్దతు ఇవ్వడం మొదలు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడకపోవడం వరకు ప్రతీదీ మోసమేనని తీర్మానించేసింది.

పవన్ కళ్యాణ్‌ పదవీ, అధికారం వద్దనుకుంటే అది ఆయన గొప్పదనమే అవుతుంది కానీ ప్రజలను, కాపులను మోసం చేసినట్లు ఎలా అవుతుంది?

పార్టీ పెట్టిన రెండేళ్ళలోనే విజయ్‌ సిఎం కాగలిగారు కానీ పవన్ కళ్యాణ్‌ డెప్యూటీ సిఎం కావడానికి పదేళ్ళుపైనే పట్టిందని ఎద్దేవా చేసింది. మరి జగన్‌ పార్టీ పెట్టిన రెండేళ్ళకే సిఎం కాగలిగారా? ఎందుకు కాలేకపోయారు?

విజయ్‌ ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ సీట్లు సాధించారు. కానీ పూర్తి మెజార్టీ రాలేదు.

డీఎంకే అధినేత స్టాలిన్ ఆయన సమస్యని, ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే జరిగే అనూహ్యమైన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకొని తమ మిత్రపక్షాల చేత మద్దతు ఇప్పించి విజయ్‌కి తోడ్పడ్డారు.

అలాంటప్పుడు విజయ్‌ ‘సింగిల్ సింహం’ ఎలా అవుతారు. ఆ సింహానికి అరడజను పార్టీలు కాపు కాస్తున్నాయి కదా? అదే… టీడీపి-జనసేన ఎన్నికలకు ముందే బహిరంగంగా పొత్తులు పెట్టుకొని, కలిసి పోటీ చేసి, గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏవిధంగా తప్పవుతుంది?

విజయ్‌ సిఎం పదవి చేపట్టి ఇంకా పది రోజులు కాలేదు. అయన ప్రభుత్వం కూలిపోతుందని ఇవాళ్ళే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో సుస్థిరమైన పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది కదా? రెండింటిలో ఏది బెటర్?

సింహాలు సింగిల్‌గా ఉండాలనుకుంటే ఫామ్‌హౌసు లేదా ప్యాలస్‌లో బందీగా ఉండక తప్పదు. వాటి సేఫ్టీ కోసం… జనం సేఫ్టీ కోసం!

ADVERTISEMENT
Latest Stories