ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ప్రజలకు కలిగే ఓ సందేహం.. వైసీపీలో దాదాపు అందరికీ ఏదో ఓ క్రిమినల్ రికార్డ్ ఎందుకుంటుంది?
వైసీపీలో చేరినందునే వారికి అటువంటి లక్షణాలు అబ్బాయా లేదా అటువంటి లక్షణాలు ఉన్నందునే వైసీపీలో చేరారా? అంటే కోడి ముందా గుడ్డు ముందా? అన్నట్లు ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పేరు కూడా పోలీస్ లిస్టులోకి వచ్చేసింది.
2021, అక్టోబర్ 19న మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనని ఏ-127గా చేర్చారు.
తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు కనుక వెంటనే ముందస్తు బెయిల్ కోసం గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు.
బెయిల్ లభిస్తే పరవాలేదు లేకుంటే ఓ సారి లోపలకు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తే వల్లభనేని వంశీలా బయటకు ఎప్పుడు తిరిగివస్తారో తెలీని పరిస్థితి!
ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా మొత్తం 44 మంది బెయిల్ సంపాదించుకొని కులాసాగా తిరుగుతున్నారు. కనుక ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పరిస్థితి ఏమిటో రేపు గుంటూరు కోర్టు చెపుతుంది.
ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్ కళ్ళలో ఆనందం చూడటం కోసం ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడుపై సుప్రీంకోర్టులో కేసు వేశారు.
అలాంటి ఆళ్ళకి 2024 ఎన్నికలలో జగన్ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేయడంతో షాక్ అయ్యారు. దాంతో ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరి గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ వైసీపీలోకి తిరిగి వచ్చేశారు.
అటు జగన్ ఆళ్ళని పక్కనపెట్టి ఆయన రాజకీయ జీవితం దెబ్బ తీస్తే, నారా లోకేష్ మంగళగిరిలో పాతుకుపోవడంతో ఇప్పుడు ఆళ్ళకు సొంత నియోజకవర్గంలో చోటు లేకుండా పోయింది!
ఇది సరిపోదన్నట్లు చేసిన పాపాలు ఇలా వెంటాడుతున్నాయి కూడా. గుంటూరు కోర్టు కాదంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఉండనే ఉన్నాయి. కానీ ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ప్రమాదకరం!
ఏది ఏమైనప్పటికీ, జగన్ కోసం ఆళ్ళ చాలా దూరం వెళ్ళారు కనుక ఆయన జైలుకి వెళితే పరామర్శించడానికి జగన్ తప్పకుండా వస్తారు. అదొక్కటే ఉపశమనం కనిపిస్తోంది.




