కాకాణిని విచారణకి రప్పించడం అంత వీజీ కాదా?

Kakani Govardhan Reddy

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి క్వార్జ్ అక్రమ తవ్వకాలు, తరలింపు కేసులో విచారణకు హాజరుకావాలంటూ నెల్లూరు పోలీసులు ఇప్పటికీ మూడుసార్లు నోటీసులు పంపారు. కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పోలీసులు నోటీస్ పంపితే విచారణకు హాజరు కాకపోవడం తప్పని భావించడం లేదు. కానీ ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు కనుక ఆయనకు నోటీస్ పంపడం తప్పని వైసీపీ సొంత మీడియా కొత్త రూల్ చెపుతోంది.

ఆయన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు. కనుక అప్పటి వరకు కాకాణి విచారణకు హాజరుకాకుండా పరారీలోనే ఉంటారని స్పష్టమయ్యింది. కానీ పోలీసులు కూడా తమ ప్రయత్న లోపం లేకుండా వరుస పెట్టి నోటీసులు పంపిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

గురువారం ఉదయం 11 గంటలకు నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నాలుగో నోటీస్ ఆయన ఇంటి గోడకు అంటించి వచ్చారు. కానీ ముందస్తు బెయిల్‌ లభించేవరకు ఆయన అజ్ఞాతంలో ఉండాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది కనుక ఈరోజు కూడా ఆయన విచారణకు హాజరు కాకపోవచ్చు.

అయితే కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు ఇప్పుడు ఇదే అవరోధంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానాలు సూచిస్తూ ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తుంటాయి.

కానీ నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని, ఆయన పోలీసులకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నందున ముందస్తు బెయిల్‌ ఇవ్వవద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుని అభ్యర్ధిస్తారు. అప్పుడు హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ నిరాకరించి, ముందు విచారణకు హాజరవ్వాలని అరెస్ట్‌ చేస్తే అప్పుడు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసుకోమని సూచించవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. కనుక పోలీసులకు ఆయనే ఈ అవకాశం కల్పిస్తున్నారని చెప్పొచ్చు.

ADVERTISEMENT
Latest Stories