శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 100కి పైనే సీట్లు… హ్యాట్రిక్ పక్కా… అని కేసీఆర్ చెప్పుకుంటే 39 సీట్లతో ఓడిపోయి ఇంట్లో కూర్చోవలసి వచ్చింది.
తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో ఈసారి 10-12 మనవే… బీజేపీకి ‘వన్ ఆర్ నన్’ అని కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటే ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 7-9 సీట్లు గెలుచుకోబోతున్నాయని, బిఆర్ఎస్ పార్టీకి 2 లేదా 3 కంటే ఎక్కువ సీట్లు రావని తేల్చి చెప్పేశాయి.
ఇక ఈసారి బిఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు కట్టబెడితే కేంద్రంలో చక్రం తిప్పడానికి నేను రెడీ… ఎందుకంటే ఈసారి కాంగ్రెస్, బీజేపీ రెండు కూటములకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి సరిపడే సీట్లు రావు కనుక జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్, మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్ వంటివారిని కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము.
అప్పుడు కాంగ్రెస్, బీజేపీలు చచ్చిన్నట్లు మాకు మద్దతు ఇస్తాయని కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి పూర్తి మెజార్టీతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పేశాయి.
ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి నిజంగానే 10-12 ఎంపీ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కేసీఆర్ పగటి కలలు కన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని ముందే చెప్పారు కూడా.
కనుక ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు కలిసి బిఆర్ఎస్ పార్టీలో మిగిలిన 37 మందిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను వదిలేసి మిగిలినవారిని ఎత్తుకుపోవచ్చు లేదా జూన్ 5వ తేదీ తర్వాత గోడ దూకేయవచ్చు.
కనుక అక్కడ కేసీఆర్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్ముకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ ఒకేసారి మునగబోతున్నారు. అయితే బిఆర్ఎస్ పార్టీలోని వారు వేరే పార్టీలలో చేరే అవకాశం ఉంది కానీ వైసీపిలోని రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు వంటివారు ఏ పార్టీలో చేరగలరు?చేరలేకపోతే వారి పరిస్థితి ఏమిటి?




