పాదయాత్ర చేస్తూ ప్రజలలో విశేషమైన ఆదరణ చూరగొంటున్న నారా లోకేష్ కు చంద్రబాబు నాయుడు అరెస్ట్ బ్రేకులు వేసినట్లయ్యింది. మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా పాదయాత్ర కంటే ముఖ్యంగా పార్టీ అధినేతను విడుదల చేయించుకోవాల్సిన బాధ్యత, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుని సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నారా లోకేష్ భుజస్కంధాలపై పడింది.
దీంతో పాదయాత్రను పక్కనపెట్టి ఢిల్లీకి పయనమైన సంగతి తెలిసిందే. ఏపీలో తమ పార్టీ అధినేతకు జరిగిన అన్యాయాన్ని జాతీయ మీడియాలో గొంతెత్తి చాటారు. దీంతో ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అందులోనూ జాతీయ స్థాయిలో విశేషమైన ఆదరణ ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత లభించింది.
జాతీయ మీడియాతో పాటు బీజేపీ పెద్దలను కూడా కలవనున్నారని మీడియా వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే మోడీ, అమిత్ షాల అనుమతి లభించకపోవడంతో ఇంకా ఢిల్లీలోనే వేచిచూస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒకవేళ లోకేష్ ఏపీలోకి ఎంటర్ అవ్వగానే ఏదొక కేసుతో జైలుకు పంపించే వ్యూహంలో వైసీపీ ఉన్నట్లుగా పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
దీంతో ఇపుడు చంద్రబాబుతో పాటు లోకేష్ ఏపీ ఎంట్రీ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఢిల్లీ పెద్దలను కలిసి తమ గోడును వెల్లడించిన పిదపే లోకేష్ ఏపీలోకి అడుగు పెడతారా? లేక చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ బాధ్యతలను నెత్తికెత్తుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలోకి ప్రవేశిస్తారా? అనేది వేచిచూడాలి.
గతంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తమ పార్టీ అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కాలు మోపారో, ఆ రోజే జైలు పాలైన వైనం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే. దీంతో లోకేష్ పై కూడా ఇలాంటి ప్లానింగ్ నే సిద్ధం చేసారా? అన్న అంశం టీడీపీ వర్గాలను కలవరపెట్టేదిగా మారిపోయింది.
ఇదిలా ఉంటే, ఒక్క లోకేష్ మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నారని జై భీం భారత్ పార్టీ జడ శ్రవణ్ వంటి వారు గట్టిగానే చెప్తున్నారు. చూడబోతుంటే… త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి ప్రతిపక్షం లేకుండా సింగిల్ పార్టీగా వైసీపీ పోటీ చేయనుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రచారంలో లోకేష్, పవన్ లతో పాటు మరికొన్ని అరెస్ట్ లు జరిగినా, జరగకపోయినా, జైలులో ఉన్న చంద్రబాబు విడుదల అయినా, లేకున్నా ప్రజలైతే మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.



