తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ రచయితగా కొనసాగుతున్న ‘డైమండ్’ రత్నంది ముక్కుసూటి వ్యక్తిత్వం అన్న విషయం ఇప్పటివరకు సినీ వర్గాలకే తెలియగా, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అభిమానించి సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఈ రత్నం, ప్రస్తుతం తన ‘గాడ్ ఫాదర్’ మాత్రం మంచు మోహన్ బాబు అని నిర్మొహమాటంగా చెప్తున్నారు.
అయితే, ‘ఎవరి ఆడియో ఫంక్షన్లకు వెళ్ళినపుడు వాళ్ళని అలా పొగిడేస్తుంటారు… ఈ భజన ఎలా చేస్తారు?’ అనే దానికి ఒక పెద్ద లాజిక్ ను చెప్పుకొచ్చారు రత్నం. రామాలయంకు వెళ్లి జీసస్ గురించి మాట్లాడితే అర్ధం ఉండదని, అలాగే చర్చికి వెళ్లి జీసస్సే అనాలి… చర్చికి వెళ్లి గోవిందా గోవిందా అంటే కుదరదు… అంటూ ఇండస్ట్రీలో సహజంగా చేసే “హీరోల భజన” గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ హీరోల భజన అన్నది వాళ్లకు కూడా తెలుసని, ఇదంతా ఇండస్ట్రీలో సర్వసాధారణమేనని తేల్చేసారు.
ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలకు కూడా తెరలేపారు రత్నం. కళ్యాణ్ రామ్ నటించిన “షేర్” చిత్రం ఫ్లాప్ అన్న విషయం మాకు ముందే తెలుసని, అయితే సినిమా సూపర్… బంపర్… అని చెప్పకపోతే ప్రేక్షకులు ధియేటర్లకు రారని, మొదటి మూడు రోజుల కలెక్షన్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతారని, అందుకే సినిమా ఆడియో వేడుకలపై అలా ప్రసంగించి అభిమానులను ఉత్సాహపరుస్తుంటామని, అయితే ఇది అన్ని సినిమాలకు జరగదు గానీ, “షేర్” విషయంలో మాత్రం హీరో కళ్యాణ్ రామ్ కు కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందన్న విషయం తెలుసనీ అన్నారు.
ఇక, “ఈడోరకం ఆడోకరం” సినిమా ఆడియో హైలైట్ అవ్వడానికి… ఆడియో వేడుక మీద ఏదొకటి చేయ్యాలి అనుకుని, హీరోయిన్ సోనరిక ‘హాగ్’ విషయం ముందుగా ప్లాన్ చేసుకున్నామని, అనుకున్న విధంగానే సోషల్ మరియు వెబ్ మీడియాలో మా సినిమా గురించి… సోనరిక ఉదంతం గురించి కధనాలు ప్రచురితం అయ్యాయని, దీంతో జనాల్లోకి బాగా వెళ్లిందని, అదే సమయంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక జరగడంతో… దాని నుండి మా సినిమాపై ప్రేక్షకులు ఫోకస్ చేసేలా జరిగిన ప్రయత్నంగా విజయవంతమైందని చెప్పుకొచ్చారు.
ఎలాంటి దాపరికం, మొహమాటాలకు తావు లేకుండా ‘డేరింగ్ అండ్ డాషింగ్’గా మాట్లాడుతున్న ‘డైమండ్’ రత్నం… ముందు ముట్టినదే పెన్ను కదలదు అన్న టాక్ ను కూడా అందిపుచ్చుకున్నాడు… అంతే కాదు దానిని ఒప్పుకున్నాడు కూడా…!



