యశ్వంత్ సిన్హాను కలిసే ప్రసక్తే లేదు: రేవంత్‌ రెడ్డి

Yashwant-Sinha-Revanth-Reddy-Hyderabadరాష్ట్రపతి ఎన్నికలో బిజెపియేతర పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగిన యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. టిఆర్ఎస్‌ తనకు మద్దతు పలికినందుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు.

ఆయన నామినేషన్ కార్యక్రమానికి మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, టిఆర్ఎస్‌ ఎంపీలు హాజరయ్యారు. రేపు ఆయన హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికేందుకు టిఆర్ఎస్‌ సిద్దం అవుతోంది. ఆయన బేగంపేట విమానాశ్రయంలో దిగినప్పుడు కేటీఆర్‌తో సహా పలువురు మంత్రులు వెళ్ళి ఆయనకు స్వాగతం పలుకుతారని సమాచారం. ఆ తరువాత 10,000 బైకులతో విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీగా ఆయనను తోడ్కొని తీసుకువెళ్లబోతున్నారు.

ADVERTISEMENT

రేపటి నుంచే హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీతో పలువురు కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణతో సహా వివిద రాష్ట్రాలకు చెందిన బిజెపి ముఖ్యనేతలు రానున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌ చేరుకోవడం, ఆయనకు టిఆర్ఎస్‌ ఇంత అట్టహాసంగా స్వాగతం పలుకుతుండటం యాదృచ్చికమని భావించలేము. యశ్వంత్ సిన్హా పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా బిజెపి సమావేశాలకు కౌంటరుగానే టిఆర్ఎస్‌ హైప్ క్రియేట్ చేస్తున్నట్లు భావించవచ్చు.

అదీ.. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ము చేతిలో ఆయన ఓడిపోబోతున్నారని తెలిసి సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను ఢిల్లీకి పంపించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పడం, ఇప్పుడు ఇంత హడావుడి చేస్తుండటం రెండూ వ్యూహాత్మకమే కావచ్చు కానీ అవి నిరర్ధకమని అందరికీ తెలుసు.

ఇక యశ్వంత్ సిన్హాకు పూర్తి మద్దతు ఇచ్చి ఆయన నామినేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌ వస్తున్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలి.

కానీ టిఆర్ఎస్‌ ఆయనను హైజాక్ చేసినట్లు ఎత్తుకుపోతుండటంతో ఆయనను కలవదలచుకోలేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. “ఆయన మమ్మల్ని కలిసిన తరువాత వెళ్ళి కేసీఆర్‌ను కలవాలనుకొన్నా, లేదా కేసీఆర్‌ను కలిసిన తరువాత మమ్మల్ని కలవాలనుకొన్నా ఆయనను కలిసేందుకు మేము సిద్దంగా లేము,” అని చెప్పారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పార్టీని, సిఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నేతలు శత్రువుగా భావిస్తూ పోరాడుతున్నారు. కనుక ఇప్పుడు యశ్వంత్ సిన్హా కోసం వెళితే టిఆర్ఎస్‌ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్నట్లు మీడియాలో ఫోటోలు వచ్చేస్తాయి. కాంగ్రెస్‌ నేతలు టిఆర్ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దం అయినట్లు వాటితో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. అందుకే యశ్వంత్ సిన్హాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్లు భావించవచ్చు.

అయితే తమ పార్టీ మద్దతు ఇస్తున్న వ్యక్తి హైదరాబాద్‌కు వస్తే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కలవకుండా దూరంగా ఉండిపోవలసిరావడం చాలా విచిత్రమైన పరిస్థితే అని చెప్పవచ్చు. కానీ ఎలాగూ ఓడిపోయే అభ్యర్ధి కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టుకోవడం లేదా నష్టపరుచుకోవడం అనవసరమే. కనుక రేవంత్‌ రెడ్డి నిర్ణయం సరైనదే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories