ఎన్నికల సమయంలో జగన్ అర్జునుడు, శ్రీకృష్ణుడు.. ప్రజలను కాపాడేందుకు దివి నుంచి భువికి దిగివచ్చిన దైవ దూత జీసస్, ఉగాదికి శ్రీకృష్ణదేవరాయలు.. శ్రీరామనవమికి సకల గుణాభిరాముడు శ్రీరాముడు…. ఇలా అనేక రూపాలలో ప్రజలకు సాక్షాత్కరిస్తుంటారు. ఈ భాగ్యం కేవలం ఆంధ్ర ప్రజలకు మాత్రమే దక్కుతున్నందుకు చాలా సంతోషించాలి.
ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
“సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామచంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
ఓ మాజీ ముఖ్యమంత్రిగా, ఓ రాజకీయ పార్టీ అధినేతగా జగన్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. కానీ ఆయన పేర్కొన్న సందేశంలో ఏ ఒక్క లక్షణమూ లేని జగన్, 5 ఏళ్ళ పాటు రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించి, తాను ప్రజా రంజకమైన పాలన చేశానని నేటికీ గొప్పగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. కనుక శ్రీరాముడి గొప్ప గుణాలను తనకు ఆపాదించుకొని ఈవిదంగా ట్వీట్ చేసిన్నట్లనిపిస్తుంది.
జగన్ తండ్రి పేరు చెప్పుకొని ప్రజల నమ్మకాన్ని సంపాదించుకొని ఒక్క ఛాన్స్ సంపాదించారు. కనుక తండ్రి పేరు నిలబెట్టేలా పాలన చేసి, ఓడిపోయి ఉంటే, నేడు ఈవిదంగా ట్వీట్ చేసినా ఎవరూ ఆయనని వేలెత్తి చూపరు.
కానీ సొంత తల్లి, చెల్లి, బాబాయ్, నమ్మిన బంటు విజయసాయి రెడ్డి వంటి వారికి కూడా హ్యాండ్ ఇచ్చి, వారి చేత కూడా వేలెత్తి చూపించుకుంటున్నప్పుడు జగన్ శ్రీరాముడి గొప్ప గుణాలు, పాలన గురించి మాట్లాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.
డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి వస్తుందని తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్, హిందూ మతం, పురాణ పురుషుల గురించి మాట్లాడుతుండటం ఇంకా ఎబ్బెట్టుగా ఉంటుంది. అయినా తాను పాటించని ధర్మం, తనకు లేని గుణాల గురించి మాట్లాడి నవ్వులపాలు అవడం దేనికి?




