కొత్త జోక్: జనంతో జగన్‌ మమేకం!

Ambati Rambabu

జగన్మోహన్‌ రెడ్డి అధికారంలో లేనప్పుడు పాదయాత్ర చేసి అడిగినవారికి అడగనివారికీ కూడా ముద్దులూ, ఆశీర్వాదాలు పంచిపెట్టిన మాట నిజం.

ఆ ముద్దులు, తీయతీయటి మాటలు, హామీలను నమ్మే ప్రజలు 2019లో చంద్రబాబు నాయుడుని కాదని జగన్మోహన్‌ రెడ్డికి అధికార పగ్గాలు అప్పజెప్పారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు ఆ కధ అంతా అనవసరం.

ADVERTISEMENT

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జగన్‌ ఇంత వరకు ప్రజల మద్యకు రాకుండా తాడేపల్లి ప్యాలస్‌, పులివెందుల ప్యాలస్‌లలో సేద తీరుతూ, గుడివాడ, అంబటి, సీదిరి వంటి నేతల చేత సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కాక ముందే ఎన్నికల హామీలు ఇంకా ఎప్పుడు అమలుచేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ పులివెందుల ప్యాలస్‌లో ‘ప్రజా దర్బార్’ నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ మరికొన్ని రోజులు కాలక్షేపం చేయబోతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై స్పందిస్తూ అంబటి రాంబాబు చెప్పిన మాటలు అందరినీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.

“జగన్‌ అంటే జనం. జనం అంటే జగన్‌. జనం నుంచి జగన్‌ ఎప్పుడూ దూరంగా ఉండలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్‌ ఎప్పుడూ జనం మద్యనే ఉండేవారు. జనంతోనే మమేకం అయ్యేవారు. చంద్రబాబు నాయుడు తన జీవితం మొత్తం ఎంతమందిని కలిశారో, ఈ 5 ఏళ్ళలో జగన్‌ అంతకు పది రెట్ల మందిని కలిశారు. కనుక జనంలోకి రావడానికి జగన్‌ భయపడుతున్నారని, మొహం చెల్లక పులివెందుల ప్యాలస్‌లో ‘ప్రజాదర్బార్’ పేరుతో కాలక్షేపం చేస్తున్నారనడం సరికాదు,” అని అంబటి రాంబాబు అన్నారు.

అయితే గత 5 ఏళ్ళలో జగన్‌ ఎన్నిసార్లు తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు వచ్చారో అడిగితే వేరెవరో కాదు… అంబటి రాంబాబే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయగలరు.

అయినా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే జగన్‌ దర్శనం లభించేది కాదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు కదా? ఇక సామాన్య ప్రజలను ఆయన ఎప్పుడు కలిశారు? అంటే బటన్ నొక్కుడు సభలకు బయటకు వచ్చినప్పుడు మాత్రమే! అదీ… జనం కనబడకుండా దారి పొడవునా పరదాలు కట్టించుకోవడం, వెళ్ళిన చోటల్లా పచ్చటి చెట్లను నరికించేయడం వగైరా స్టోరీలు అందరికీ తెలుసు.

సామాన్య ప్రజలు ఎవరూ తాడేపల్లి ప్యాలస్‌ దరిదాపులకు కూడా వెళ్ళకుండా చుట్టూ రోడ్లపై బారికేడ్లులు, వందల కొద్దీ పోలీసులు, ప్యాలస్‌ చుట్టూ ఎత్తైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకొన్న సంగతి అంబటి రాంబాబు గుర్తులేన్నట్లు మాట్లాడుతున్నారు.

ప్రజల వలన కూడా ప్రాణభయం ఉందని జగన్‌ భయపడుతుండటం వలననే ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నారని అర్దమవుతూనే ఉంది.

కనుక అంత ప్రాణభీతి ఉన్న జగన్‌ ఇప్పుడవన్నీ లేకుండా జనం మద్యకు రావాలంటే ధైర్యం కూడగట్టుకోవలసి ఉంటుంది. బహుశః అందుకే ముందుగా ప్యాలస్‌లో ‘ప్రజా దర్భార్’ పేరుతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారేమో?అని జనం అనుకుంటే దానికీ అంబటి రాంబాబు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవరు నవ్వుల పాలవుతారు?

ADVERTISEMENT
Latest Stories