లేడికి లేచిందే పరువు అన్నట్లు వైసిపి అధినేత జగన్ బుర్రలో ఓ ఐడియా పుట్టగానే ముందు వెనక చూడకుండా అమలు చేసేసి ఎదురు దెబ్బలు తింటుంటారు.
ప్రజా వేదిక కూల్చివేత, మూడు రాజధానులు, పోలవరం రివర్స్ టెండరింగ్, చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేయడం వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కర్ణుడు చావుకి వంద కారణాలు అన్నట్లు అటువంటి తప్పులన్నీ కలిపి వైసిపి ఓటమికి కారణం అయ్యాయి.
ఎన్నికలలో టిడిపి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వాదిస్తున్న జగన్, అందుకు ఎన్నికల ఫలితాలు వెలువడి జూన్ 4ని ఎంచుకోవడం చాలా పొరపాటు.
ఎందుకంటే అప్పటికి టిడిపి గెలిచింది కానీ అధికారం చేపట్టలేదు. జూన్ 12న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కనుక జూన్ 12 కి ఏడాది పాలన పూర్తవుతుంది. ఆ రోజున వైసిపి నిరసనలు తెలిపినా అర్థం ఉండేది.
కానీ జూన్ 4న వెన్నుపోటు దినం అంటూ నిరసనలు తెలపడానికి సిద్ధం అవుతుండటంతో దాని అర్థమే మారిపోయింది.
ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేశాను. అయినా వాళ్లు మనని ఎందుకు కాదనుకున్నారో అర్థం కావడం లేదన్నారు.
అంటే సంక్షేమ పథకాల పేరుతో నేను డబ్బు పంచి పెడితే అందరూ తీసుకున్నారు కానీ అందుకు కృతజ్ఞత చూపకుండా ఎన్నికలలో ఓడించారని జగన్ అభిప్రాయపడుతున్నారని అర్థమవుతుంది.
కనుక ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని నిరసన తెలుపుతున్నట్టు ఉంది. కూటమి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నామనుకొని ప్రజలు మమ్మల్ని మోసం చేశారని నిరసన తెలపడం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?
ఇదివరకు కూడా ఇలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఒకసారి, విద్యుత్ చార్జీలు పెంచక ముందే మరోసారి ఇలాగే తొందరపడి నిరసనలు తెలిసి వైసీపీ నవ్వులు పాలయ్యింది.
ఇప్పుడు ప్రజా తీర్పుని ప్రశ్నిస్తూ నిరసనలు జరిపి మరోసారి నవ్వులు పాలయ్యేందుకు సిద్ధమవుతున్నారు.




