మిథున్ రెడ్డి తర్వాత జగనే కానీ…

Mithun Reddy Jagan

ఊహించినట్లే సిట్ అధికారులు ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. ఆయనని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈ కేసుకి సంబందించి ప్రాధమిక ఆభియోగ పత్రం (ప్రిలిమినరీ ఛార్జ్ షీట్) దాఖలు చేశారు.

దానిలో ఈ కుంభకోణం రూపకల్పన మొదలు అమలుచేయడం వరకు వివిధ దశలలో వైసీపీ అధినేత మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని నిర్ధారించే అంశాలు పేర్కొన్నారు.

ADVERTISEMENT

కానీ దీనిలో జగన్‌ పేరుని నిందితుడుగా పేర్కొనలేదు. తదుపరి ఛార్జ్ షీట్‌లో అలా పేర్కొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కనుక మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్‌కు నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది.

ఈ కేసులో ఏదో రోజు తాను అరెస్ట్ కావడం ఖాయమని జగన్‌కి కూడా తెలుసు కనుక “నేను ఎక్కడికి పారిపోవడం లేదు… ఇక్కడే ఉన్నాను… కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చని,” జగన్‌ ఇదివరకే చెప్పేశారు.

కానీ సిట్ అధికారులు తొందరపడకుండా అంతా పద్దతిగానే చేయనున్నారు. జగన్‌ మాజీ ముఖ్యమంత్రి కనుక ఆయనని అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కానీ విచారణకు అవసరం ఉండకపోవచ్చు కనుక త్వరలోనే నోటీస్ పంపించే అవకాశం ఉంది.

విచారణలో అయన చెప్పిన విషయాలు, ఈ కేసులో కోర్టు అభిప్రాయాలను గవర్నర్‌కి తెలియజేసి అయన అనుమతితోనే జగన్‌ని అరెస్ట్ చేయవచ్చు.

ఇంతవరకు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎస్‌పీవై డిస్టిలరీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, మాజీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి ప్రధాన అనుచరులను, శనివారం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

సిట్ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు జరిపి ఈ కేసుకి సంబంధించి పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ తయారుచేసి కేసు ఫైల్ చేస్తున్నారు. కానీ ఇటువంటి కేసులను వైసీపీ నేతలు ‘ఫుట్ బాల్’ ఆడినట్లు ఆడుకోగలరని అక్రమాస్తుల కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసులలో నిరూపించి చూపారు. కనుక అందరినీ దోషులుగా నిరూపించి శిక్ష పడేలా చేయడం చాలా కష్టమే.

మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని తెలిస్తేనే నిన్న గన్నవరం విమానాశ్రయం వద్ద వైసీపీ శ్రేణులు చాల హడావుడి చేశారు. ఇక జగన్‌ని విచారణకు పిలిస్తే వారి హడావుడి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కనుక ఇది కూడా పోలీసులకు ఓ పెద్ద అగ్ని పరీక్షే అని చెప్పక తప్పదు.

ఒకవేళ ఈ కేసులో జగన్‌ని అరెస్ట్ చేసినా ఆయన కొన్ని వారాలు లేదా నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేసి యధాప్రకారం రాజకీయాలు చేసుకోగలరు. పైగా తాను చంద్రబాబు నాయుడి రాజకీయ కక్ష బాధితుడినని చెప్పుకొని ప్రజల సానుభూతి కూడా పొందగలరు.

కనుక సిట్ అధికారులు ఈ కేసులో దోషులందరికీ శిక్ష పడేలా చేయలేకపోతే, ఈ కేసులు, అరెస్టుల వలన కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఎంతో కొంత నష్టం చేసే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories