ఎవరైనా ఒక ఊబిలో చిక్కుకుంటే అందులో నుంచి భయటపడి బతికి బట్ట కట్టడం అసాధ్యం అని, ఇక వారు అందులో జల సమాధి కావాల్సిందే అని, ఇలా ఊబి అంటే ప్రాణాంతకం అనే ఏకాభిప్రాయం సమాజంలో చాల బలంగా పాతుకుపోయింది.
అయితే ఇప్పుడు అటువంటి ఊబిలోనే పీకల్లోతుల్లో కూరుకుపోయింది వైసీపీ. మరి ఇక్కడ వైసీపీ ని కబళిస్తున్న ఆ ఊబి జలప్రవాహంతో నిండింది కాదు జనసంచారంతో, పచ్చని పంట పొలాలతో కళకళలాడే రాష్ట్ర రాజధాని అమరావతి.
గత పదేళ్లుగా వైసీపీ ఈ రాజధాని అనే ఊబిలో అంచలంచలుగా కూరుకుపోతూ రాష్ట్ర భవిష్యత్ తో మూడు ముక్కలాట ఆడుతుంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షానికే పరిమితమైన వైసీపీ మాత్రం ఈ ఊబిలో నుంచి బయటకు రాలేకపోతుంది.
నాడు మూడు రాజధానులు అంటూ అమరావతి ఊబిలో దిగిన వైసీపీ నేడు మూడు మార్చుకున్నాను మహాప్రభో అంటూ గోల పెట్టినా, లేదు ఆ మూడుకే కట్టుబడి ఉన్నానంటూ కథం తొక్కినా వైసీపీ ని మాత్రం ఆ ఊబి రాజకీయంగా కిందకు లాగేస్తుంది, పాతాళానికి తొక్కేస్తుంది.
ఇప్పుడు వైసీపీ మూడు రాజధానులు అంటూ ముందుకు వెళ్ళలేదు, అలా అని తన అహం చంపుకుని అమరావతే రాజధాని అంటూ సర్దుకుపోలేదు. ఒకవేళ వైసీపీ తన రాజకీయ అవసరాల నేపథ్యంలో అమరావతే రాజధాని అంటూ వెనక్కి తగ్గినా వైసీపీ ని నమ్మి ఆ పార్టీని రాజకీయంగా ముందుకు తెచ్చేందుకు ఏపీ ప్రజానీకం సిద్ధంగా లేరు.
లేదు వైసీపీ మాట తప్పదు మడం తిప్పదు అంటూ మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడినా ఆ విధానాలకు ఇప్పటికే 151 నుంచి 11 కొచ్చింది. ఇప్పుడు కూడా అదే ధోరణితో వైసీపీ ముందుకెళితే అంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ ఒక చరిత్రగా మిగిలిపోవాల్సిందే.
ఇలా ఎటువైపు ప్రయాణం చేసినా రాజధాని అమరావతి అనే ఊబి నుంచి వైసీపీకి బయటపడే మార్గం కనిపించడం లేదు. మూడు రాజధానులు అంటూ సజ్జల తవ్విన ఈ ఊబి నుంచి వైసీపీ ఇప్పట్లో బయటపడే అవకాశం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల ప్రజా ధనం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, ఏపీ ప్రజల భవితవ్యం, ఎన్నో అవమానాలకు సమాధానం, విభజన అనే గాయానికి చికిత్స ఇలా అన్ని కలగలిపి ఏడు కోట్ల ఆంధ్రుల ఆశలకు గుర్తింపు, గౌరవమే అమరావతి నిర్మాణం.
మరి అటువంటి అమరావతినే తమ ముర్కత్వం తో, మొండి వాదనతో, మూడు ముక్కలాటతో అరణ్యంగా మార్చిన వైసీపీ సజ్జల సలహాలతో, సాక్షి చేస్తున్న అసత్య ప్రచారాలతో అమరావతి ఊబిలో కూరుకుని రాజకీయ సమాధి కావాల్సిందేనా.?





