ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కన్నా బీజేపీ ప్రయోజనాల కోసం ఎక్కువగా తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తున్నాయి.
రాష్ట్రానికి కేంద్రం నుండి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా నుంచి పోలవరం నిర్మాణం వరకు ప్రతి అంశంలోనూ టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు ఇప్పటి వరకు ఒకేతాటి మీదకు వచ్చి తమ ఏకాభిప్రాయాన్ని వెల్లడించిందే లేదు.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణ సమాశంలో కూడా మూడు పార్టీల రాజకీయం ఇదే తీరుగా ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగింది. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ ఎత్తుకున్న హిందీ భాష నినాదం పై మాత్రం మూడు పార్టీల అధినేతలు బీజేపీ వాదానికి మద్దతు తెలిపారు.
ముందుగా పవన్ విషయానికొస్తే, పవన్ గత కొంతకాలంగా జనసేన గ్లాసులో బీజేపీ ఎజెండాలను ప్రచారం చేస్తూ బీజేపీ నినాదాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు పవన్ ఎత్తుకున్న సనాతన ధర్మం నుంచి హిందీ భాష వరకు అన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కి పూర్తి మద్దతు తెలుపుతున్నారు.
పనిలో పనిగా ప్రత్యర్థుల చేత అనవసర విమర్శలను ఎదుర్కుంటున్నారు, అలాగే కొత్త రాజకీయ ప్రత్యర్థులను సృష్టించుకుంటున్నారు. ఇందులో భాగంగానే తెలుగు భాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ బీజేపీ హిందీ భాష వాదనకు తనవంతు మద్దతు తెలిపారు పవన్.
ఇక టీడీపీ పార్టీ నుంచి మంత్రి లోకేష్ హిందీ భాష జాతీయ భాష అంటూ ప్రకటించి బీజేపీ వాదనకు మరింత బలం చేకూర్చారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు సంస్కరణ సభలో ప్రసంగిస్తూ బహు భాష విధానాలను కొనియాడారు.
మాతృభాషతో పాటు ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం అవసరం అంటూ బీజేపీ కి టీడీపీ నుంచి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇక టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిపి బలపరిచిన ఏకాభిప్రాయాన్ని వైసీపీ పూర్తిగా విభేదిస్తుంది. అటువంటిది ఈ హిందీ భాష పై మాత్రం వైసీపీ అధినేత వైస్ జగన్ కూటమి అభిప్రాయానికి మద్దతు ప్రకటించారు.
ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ హిందీ భాష జాతీయ భాషే అంటూ వైసీపీ తరుపున బీజేపీ వాదానికి ఓటేశారు. దీనితో ఇన్నాళ్లుగా ఏపీలో మూడు పార్టీల మధ్య కనపడని ఏకాభిప్రాయాన్ని హిందీ భాష తో బీజేపీ చేసి చూపించిందా అంటూ ఏపీ ప్రజానీకం నోరెళ్లబెడుతున్నారు.




