ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలుత పలువురి పేర్లు వినిపించినప్పటికీ, చివరకు ఆ పదవిని యోగి ఆదిత్యనాథ్ చేజిక్కుంచుకున్న విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా తెరపైకి తీసుకువచ్చిన ఆదిత్యనాథ్ పేరును ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎంపిక చేయడం చర్చనీయాంశం అయింది. ఎంతో నిరాడంబరంగా ఉండే యోగి జీవన విధానం మోడీ, అమిత్ లకు ఎంతో నచ్చడంతో పాటు, జనాల్లో ఉన్న ఆదరణ, క్రమశిక్షణ, పార్టీ కోసం కష్టపడే తత్వం వారిని యోగివైపు మొగ్గుచూపేలా చేశాయి.
ఐదు సార్లు వరుసగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై, ఆపై ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్, తదుపరి లక్ష్యం, దేశానికి ప్రధాని కావడమేనని, అందుకు రంగం సిద్ధమైందని అనుచరగణం, తోటి హిందూ మతాధిపతులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం అయిన ఆయన, తదుపరి దేశానికే నేత కానున్నారని హరిద్వార్ జ్ఞాని మహంత్ మన్వేంద్ర వ్యాఖ్యానించడం పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.
ఆదిత్యనాథ్ సన్నిహితుడు మరొకరు మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రధానిగా ఉన నరేంద్ర మోడీ 2019లో తిరిగి ప్రధానిగా ఎన్నికవుతారని, ఆపై 2024 నాటికి మోడీ కన్నా యోగి ఆదిత్యనాథ్ కు పరపతి పెరిగి ఆయన ప్రధాన నేత కానున్నారని అన్నారు. తన కుమారుడి పయనంపై ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బాసిత్ స్పందిస్తూ… తన కొడుకు ఏదో ఒకరోజు దేశానికి అధినేతగా మారుతారని చెప్పారు. ఇలా సిఎం అయ్యారో లేదో అప్పుడే భవిష్యత్తులో కాబోయే పిఎం అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు బిజెపి నేతలు.



