వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అనుబంద ఛార్జ్ షీట్లో ఏ-8గా చేర్చడంతో ఆయనతో సహా వైసీపీలో ఆయనకు అండగా నిలబడినవారు ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల “ఇది ఆస్తుల కోసం జరిగిన హత్య కాదు… రాజకీయ హత్య అనే భావిస్తున్నానని” ఇచ్చిన వాంగ్మూలం, వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో వైసీపీలో కలవరం మొదలైన్నట్లే ఉంది. అందుకే అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ వ్రాయగా, ఈ హత్యతో ఆయనకు ఎటువంటి సంబందమూ లేదంటూ ఆత్మసాక్షి తీర్పు చెప్పేసింది.
ఈ హత్య కేసును తొలుత దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారి రాంసింగ్, మొదటి నుంచి తనను, తన తండ్రిని ఈ కేసులో ఇరికించేందుకే ప్రయత్నించారని, ఆ దిశలో దర్యాప్తు చేశారని అవినాష్ రెడ్డి సీబీఐకి వ్రాసిన తాజా లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్రూవరుగా మారిన దస్తగిరి మాటలను పరిగణనలోకి తీసుకొన్నారే తప్ప తాను సూచించిన అంశాలను పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు.
కనుక రాంసింగ్ నివేదిక ఆధారంగా చేసుకొని తనను, తన తండ్రిపై అభియోగాలు మోపడం సరికాదని అవినాష్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. కనుక ఈ కేసులో రాంసింగ్ నివేదికపై సీబీఐ అధికారులు పునసమీక్షించాలని అవినాష్ రెడ్డి లేఖలో కోరారు.
ఓ పక్క సీబీఐ కోర్టులో, మరో పక్క సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా, అవినాష్ రెడ్డి ఈవిదంగా సీబీఐకి లేఖ వ్రాయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఆత్మసాక్షి కూడా సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేకపోయిందని, ఈ కేసులో వైఎస్ షర్మిల కూడా ఎందుకు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్దం కావడం లేదని పేర్కొంది.
అంటే సీబీఐ, సాక్షులు అందరూ తప్పు చెపుతున్నారని, తాము సూచిస్తున్న విషయాలను పరిగణనలోకి తీసుకొని, తాము సూచించిన కోణంలో దర్యాప్తు జరిపి, తాము సూచించినవారిని దోషులుగా సీబీఐ నిర్ధారిస్తే బాగుంటుందని ఆయన, ఆత్మసాక్షి కోరుకొంటున్నట్లు అర్దమవుతోంది.
ఎవరు కోరుకొన్నట్లుగా వారే విచారణ జరుపుకొని తీర్పులు చెప్పుకొనే వెసులుబాటు ఉంటే ఈ సీబీఐ, న్యాయవస్థలూ ఏదీ అవసరం లేదుగా?
చివరిగా కొన్ని భేతాళ ప్రశ్నలు… గుండెపోటుతో చనిపోయిన వివేకా మృతదేహాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళి బ్యాండేజీలు ఎవరు కట్టించారు? ఎందుకు కట్టించారు?
గుండెపోటుతో చనిపోయారన్న వివేకా అంత్యక్రియలు వెంటనే ముగిసి ఉంటే, ఇప్పుడు ఆయన చావుతో చంద్రబాబు నాయుడుకి, సునీతా రెడ్డికి సంబందంధం ఉందనగలరా?
గుండెపోటుతో చనిపోతున్నప్పుడు వివేకా ఆవిదంగా ఎందుకు లేఖ వ్రాసిన్నట్లు?
ఆనాడు గుండెపోటుతో చనిపోయారని చెప్పినవారే ఇప్పుడు ఆయన ఆస్తి కోసం హత్య చేయబడ్డారని ఏవిదంగా వాదిస్తున్నారు?



