వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఎవరూ ఇప్పుడు బయట కనబడటం లేదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నారు. వారికంటే వారి సాక్షి మీడియా, సోషల్ మీడియా రెండూ ఇంకా యాక్టివ్గా ఉన్నాయి. ఆ రెండూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలపై అప్పుడే తీవ్ర విమర్శలు చేస్తూ, వైసీపి నేతలు మళ్ళీ ప్రజల మద్యకు వచ్చేందుకు మార్గం సుగమం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన నారా లోకేష్ విద్యాదీవెన, వసతి దీవెన పధకాల స్థానంలో పాత ఫీజ్ రీఇంబర్స్మెంట్ విధానం అమలుచేసేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
దీనిపై వైసీపి సోషల్ మీడియా వెంటనే స్పందిస్తూ, విద్యార్ధులకు పూర్తి ఫీజులు చెల్లించకుండా ఎగవేసేందుకే పాత ఫీజ్ రీఇంబర్స్మెంట్ విధానం అమలులోకి తెస్తోందని విమర్శలు గుప్పించింది. ఫీజులు కట్టలేక తల్లితండ్రులు ఆస్తులు అమ్మి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునేలా చేయబోతున్నారని విమర్శలు గుప్పించింది.
దానికి టిడిపి కూడా వెంటనే అంతకంటే ఘాటుగా పెద్ద జవాబే ఇచ్చింది. గత 20 ఏళ్ళుగా చక్కగా నడుస్తున్న ఫీజ్ రీఇంబర్స్మెంట్ విధానాన్ని తొలగించి, ఓట్ల పిచ్చితో సైకో జగన్ దిక్కుమాలిన పధకాలను ప్రవేశపెట్టి అంతా గందరగోళం చేశాడు. రివర్స్ పాలనతో 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన సైకో రూ.3,480 కోట్లు ఫీజ్ రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు.
మీ సైకో జగన్ ఎన్నికల సమయంలో సొంత కాంట్రాక్టర్లకి రూ.4,000 కోట్లు బకాయిలు చెల్లించాడు కానీ కాలేజీలకు బకాయిలు చెల్లించలేదు. ఆ కారణంగా రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్దులకు సర్టిఫికేట్లు, మార్క్ లిస్టులు రాలేదు. అవి రాకపోవడంతో చదువులు పూర్తయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. పైచదువులు చదువుకోలేకపోతున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్దులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటినీ అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తుంటే వైసీపి విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది.
బెంగళూరు ప్యాలస్లో అంతర్జాతీయ మానసిక వైద్య నిపుణులతో చికిత్స తీసుకుంటున్న నీకు ఇప్పుడు మేము ఏమి చెప్పినా అర్దం కాదు. కనుక ఫీజ్ రీఇంబర్స్మెంట్ విధానం గురించి అర్ధం కాకపోతే మీ విజయసాయి రెడ్డిని అడిగితే వివరంగా చెపుతాడు అంటూ టిడిపి ఘాటుగా బదులిచ్చింది.
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు… అలాగే వైసీపి ఎన్నికలలో ఓడిపోయి నెలరోజులు అయ్యింది. కనుక అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం జగన్ సృష్టించిపెట్టిన సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరిస్తూ తనదైన విధానాలతో మళ్ళీ అన్ని వ్యవస్థలను గాడిన పెట్టేందుకు కృషి చేస్తోంది.
టిడిపి కూటమి ప్రభుత్వం నెలరోజులలో చాలా చురుకుగానే పని చేస్తోంది కానీ జగన్ మాత్రం వైసీపి నేతలతో ఓటమిపై సమీక్షా సమావేశాలు జరుపడం లేదు. జగన్తో సహా వైసీపిలో అందరూ ప్రజల మద్యకు వచ్చేందుకు జంకుతున్నారు.
ఇదివరకు మంత్రి రోజా కనీసం 50 మంది అనుచరులను వెంటబెట్టుకొని నెలకు 3-4 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. కానీ ఇప్పుడు తిరుమల వెళ్ళేందుకు కూడా జంకుతున్నారంటే వైసీపి నేతల పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ ఇద్దరూ తమ ప్యాలస్లో కూర్చొని తమ సొంత మీడియా, సోషల్ మీడియా చేత ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.




