సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నేషనల్ లా ట్రిబ్యునల్, హైదరాబాద్ ఉపశమనం కలిగించింది.
జగన్మోహన్ రెడ్డి ఈ కంపెనీలో తల్లి విజయమ్మకు, చెల్లి షర్మిలకు గిఫ్ట్ డీడ్ ద్వారా వాటాలు ఇచ్చారు. కానీ వాటాల బదిలీ తదుపరి ప్రక్రియని పూర్తి చేయలేదు. ఆ ప్రక్రియ పూర్తికాక మునుపే వారి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి.
ఈలోగా వారిరువురూ కంపెనీలో వాటాలు మోసపూరితంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గత ఏడాది సెప్టెంబర్లో నేషనల్ లా ట్రిబ్యునల్, హైదరాబాద్ పిటిషన్ వేశారు. ఈ కంపెనీ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి, తన వాటాలను పునరుద్దరించాలని జగన్ కోరారు.
దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ నేడు తీర్పు ఇస్తూ, ఈ కంపెనీపై ఆర్ధిక వ్యవహారాలపై ఈడీ, సీబీఐలు విచారణ జరుపుతున్నందున వాటాలు బదిలీలకు వీలు ఉండదని తేల్చి చెప్పింది.
ఇది వందల కోట్లు విలువ చేసే వ్యవహారం కనుక ఇది విజయమ్మ, షర్మిలకు పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చు. కాగా ఈ తీర్పు జగన్కు అనుకూలంగా వచ్చినట్లు భావించవచ్చు.
కానీ ఈ కంపెనీ ఆర్ధిక వ్యవహారాలపై ఈడీ, సీబీఐలు విచారణ జరుపుతున్నందున వాటాలు బదిలీలకు వీలు ఉండదని కూడా చెప్పింది. కనుక యధాతధ స్థితి కొనసాగుతుందని చెప్పినట్లు అర్ధమవుతుంది.
కనుక ఈ కంపెనీ ఆస్తులు, వాటాలతో జగన్ కూడా ఎటువంటి లావాదేవీలు చేసేందుకు వీలులేదని చెప్పినట్లే అనుకోవచ్చు.
ఈ ఆస్తుల వ్యవహారంలో తల్లి, చెల్లి తనని మోసం చేశారని జగన్ ఆరోపించారు. అలాగే జగన్ తమని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని వారిరువురూ ఆరోపిస్తున్నారు. కనుక ఆస్తుల విషయంలో ముగ్గురూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారని వారి ఆరోపణలతోనే స్పష్టమవుతోంది.
రుషికొండపై రూ.500 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ప్యాలస్లు నిర్మించుకునేందుకు వెనకాడని జగన్, సొంత ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్వటానికి కూడా వెనుకాడలేదు. అంటే తన సొమ్ము అయితే ప్రతీ రూపాయి విలువైనదే కానీ లక్షల కోట్ల ప్రజాధనానికి ఎటువంటి విలువ లేదన్న మాట! ఈ కేసులో జగన్ గెలిచినట్లు అనుకుంటే, ఓ కుమారుడిగా, ఓ అన్నగా నైతికంగా ఓడిపోయారని చెప్పక తప్పదు.






