జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎడాపెడా అప్పులు చేస్తూనే ఉంది. అదంతా సంక్షేమ పధకాలకే ఖర్చు చేసేస్తోందని అనుకొన్నా ప్రజలకే కదా ఇస్తోందని సరిపెట్టుకోవచ్చు. కానీ మూడేళ్ళలో సుమారు రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి రూ.1.65 లక్షల కోట్లు మాత్రమే సంక్షేమ పధకాలకు ఇచ్చినట్లు స్వయంగా సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలో చెప్పారు. పోనీ మిగిలిన దాంతో రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి పనులు చేశారా అంటే రాజధాని అమరావతి, పోలవరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఇన్ని లక్షలు కోట్లు తెచ్చారు కనుక కనీసం రాష్ట్రంలో రోడ్లన్నీ సినిమా హీరోయిన్ బుగ్గలా మెరిసిపోతున్నాయా…. అంటే అదీ లేదు. చెరువులను తలపిస్తున్న గుంతలు పడిన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి జనాలు కుళ్ళు జోకులు వేస్తుంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వలేక ఏడ్వలేక బాధపడుతున్నారు. కనుక ఆ లక్షల కోట్లు సొమ్ము ఎక్కడ కర్సై పోయిందో వారికే తెలియాలి.
అన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చుకొంటున్నా, అమరావతిలో భూములు అమ్ముకొంటున్నా ఇంకా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో నుంచి రూ.800 కోట్లు, కోవిడ్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కేటాయించిన రూ.1,100 కోట్లు తీసుకొని ప్రభుత్వం వాడేసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కోవిడ్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కేటాయించిన రూ.1,100 కోట్లు వాడేసుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రెండు వారాలలోగా ఆ సొమ్మును మళ్ళీ ఆ ఖాతాలో జమాచేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఇంకా సాగతీత అనవసరమని తామే ఉత్తర్వులు జారీ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాట జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదే అని చెప్పవచ్చు.
సుప్రీంకోర్టు తీర్పుపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ, “నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమచెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిది.
తప్పులు చేస్తున్నదే కాకుండా, వాటిని సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోంది. కోవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను కూడా దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ వైఖరికి నిదర్శనం.
కోవిడ్ లేదా వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం….ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమే.
కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలుచెయ్యాలి. కోవిడ్ తో చిన్నాభిన్నం అయిన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలి,” వరుస ట్వీట్స్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమచెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిది.(1/4) pic.twitter.com/x7vQQru9gD
— N Chandrababu Naidu (@ncbn) July 18, 2022
—



