మాట తప్పని, మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక హామీలలో ఏపీలో సంపూర్ణ మధ్య నిషేధం ఒకటి. కానీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వమే మధ్యం వ్యాపారంలో దిగింది. భవిష్యత్లో ఎన్నటికీ సంపూర్ణ మధ్యనిషేధం ఉండబోదని స్పష్టం చేస్తూ, భవిష్యత్లో అమ్మకాలని చూపి రుణాలు కూడా తీసుకొంది. కనుక ఏ రాష్ట్రంలోనైనా మందు బందు కావచ్చునేమో కానీ ఏపీలో మందుబాబులకి ఆ భయం ఉండబోదు.
ఇక విషయం ఏమిటంటే, ఏపీలో జాబ్ క్యాలండర్, పారిశ్రామిక, ఐటి పాలసీలు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు లిక్కర్ పాలసీని అప్డేట్ చేస్తుంటుంది. తాజాగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి వైసీపి ప్రభుత్వం లిక్కర్ పాలసీ ప్రకటించింది. 2019లో విజయవంతంగా అమలుచేసిన లిక్కర్ పాలసీనే ఈ సంవత్సరంలో కూడా అమలుచేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ లిక్కర్ సంవత్సరంలో అంటే 2023-24లో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కు చెందిన 2,934 రీటెయిల్ మద్యం దుకాణాలు యధాతధంగా కొనసాగనున్నాయి. 2023 అక్టోబర్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30వరకు మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ లైసెన్సులు జారీ చేస్తుంది. వార్షిక లైసెన్స్ ఫీజు చెల్లించిన రీటెయిల్ దుకాణాలకు, బార్లకు లైసెన్సులు పొదిగిస్తామని అబ్కారీ శాఖ కమీషనర్ చెప్పారు.
ఇప్పటి వరకు రీటెయిల్ మద్యం దుకాణాలలో నగదు చెల్లింపులను మాత్రమే స్వీకరిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ చెల్లింపులు అనుమతిస్తామని తెలిపారు. కొత్తగా మద్యం వాక్-ఇన్ స్టోర్లు ప్రారంభించెందుకు ఏపీ పర్యాటక సంస్థకు అనుమతి మంజూరు చేసింది. వైసీపి ప్రభుత్వం చివరి సంవంత్సరంలో కూడా లిక్కర్ పాలసీ ప్రకటించింది కనుక సంపూర్ణ మద్య నిషేధం హామీని అమలుచేస్తుందని మందు బాబులు ఆందోళన చెందనవసరం లేదు.



