జీతాలకు డబ్బు ఉండదు కానీ చంద్రబాబుపై కేసులకు కావలసినంత!

Chandrababu_Naidu_YS_Jaganవైసీపి ప్రభుత్వానికి రాజధాని, రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక, ఐ‌టి రంగాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటివాటిపై ఏమాత్రం ఆసక్తి, ముందుచూపు లేకపోవచ్చునేమో కానీ టిడిపిని ఏవిదంగా తుడిచిపెట్టేయాలనే దానిపై పూర్తి స్పష్టత ఉంది. చాలా దూరదృష్టితో ఆలోచించి పక్కా ప్లాన్ కూడా సిద్దం చేసుకొంది. చంద్రబాబు నాయుడుపై వరుసపెట్టి నమోదు చేస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం.

అటు హైకోర్టులో ఇటు ఏసీబీ కోర్టులో కౌంటర్ పిటిషన్లు వేస్తూ టిడిపి న్యాయపోరాటాలు చేస్తోంది. అవి పూర్తయ్యేలోగానే వైసీపి ప్రభుత్వం మరో కొత్త కేసు నమోదు చేసి, కోర్టులో కస్టడీ పిటిషన్లు వేస్తోంది.

ADVERTISEMENT

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసుపై ఇరు పక్షాల వాదనలు, విచారణ పూర్తయ్యి తీర్పు వెలువడేలోగా వైసీపి ప్రభుత్వం ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు వేసింది. దానిపై విచారణలు జరుగుతుండగానే ‘అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్’ కేసు వేసింది. రెండు కోర్టులలో ఈ కేసుల విచారణలు జరుగుతూనే ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు మరికొద్ది సేపటిలో తీర్పు చెప్పబోతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది.

కోర్టులకు కేసులు, విచారణలు, వాయిదాలు సర్వసాధారణమే. కనుక చంద్రబాబు నాయుడుపై కేసులలో జాప్యం కూడా సహజమే. అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులతో మంచి అనుభవం సంపాదించిన వైసీపికి ఈ విషయం బాగా తెలుసు. కనుకనే ఓ ప్లాన్ ప్రకారం ఒకదాని తర్వాత మరో కేసు వేస్తూ కోర్టులలో కేసుల విచారణ కొనసాగేలా చేస్తోంది.

కనుక చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు రెండు కోర్టులలో న్యాయపోరాటాలు చేస్తూ ఆయనను విడిపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికీ తెలుసు… ఒకవేళ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుకి ఊరట లభిస్తే వైసీపి ప్రభుత్వం వెంటనే హైకోర్టులో సవాలు చేస్తుందని! అక్కడా ఊరట లభిస్తే సుప్రీంకోర్టులో సవాలు చేసి కేసులు కొనసాగేలా చేయడం తధ్యమని! అంటే ఈ కేసులలో చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు బెయిల్ లభిస్తుందో తెలీని పరిస్థితి కనిపిస్తోంది.

అయితే చంద్రబాబు నాయుడు విషయంలో, అలాగే సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెట్టి 2024లో జరుగబోయే ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఇంత దూరదృష్టితో ఆలోచించగలిగిన వైసీపి ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్ గురించి ఎందుకు ఆలోచించలేకపోతోంది? అనేదే ప్రశ్న. ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పెన్షన్స్ చెల్లించలేకపోతున్న వైసీపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయకక్ష తీర్చుకొనేందుకు వేస్తున్న ఈ కేసుల కోసం విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేస్తుండటాన్ని ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories