వైసీపీ రాజకీయ అవసరాల కోసం సృస్టించుకొన్న వాలంటీర్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తోంది. జగన్ కుటుంబం అధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రిక అమ్మకాలు పెంచేందుకు సుమారు 4 లక్షల మంది వాలంటీర్లకు నెలకు రూ.200 చొప్పున అలవెన్స్ కూడా చెల్లిస్తోంది. ఇవన్నీ సరిపోనట్లు వైసీపీ ప్రభుత్వం ఏటా వాలంటీర్లకు వందనం పేరిట వందల కోట్లు నగదు పురస్కారాలు అందిస్తోంది.
నేడు విజయవాడలో ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోఉత్తమ వాలంటీర్లకు సేవామిత్రా, సేవారత్న, సేవావజ్ర అవార్డులు ఇచ్చి వాటితో నగదు పురస్కారాలు అందించబోతున్నారు.
ఈ కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 2,33,719 వాలంటీర్లకు రూ.243.34 కోట్లు ప్రజాధనం ప్రభుత్వం పంచిపెట్టబోతోంది. వాలంటీర్లు ప్రజల వద్దకు వెళ్ళి పింఛనులు అందజేస్తూ వారి సమస్యలను సచివాలయాల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నందుకు ఈ అవార్డులు, నగదు బహుమతులు పంచిపెడుతున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పుకొంటోంది.
సేవావజ్ర అవార్డు కింద ఒక్కొక్కరికీ రూ.30,000 చొప్పున మొత్తం 875 మందికి, సేవారత్న కింద రూ.20,000 చొప్పున 4,227మందికి, సేవామిత్ర కింద రూ.10,000 చొప్పున 2,28,624 మందికి నగదు బహుమతులు అందించబోతోంది.
ప్రభుత్వంలో సంక్షేమ, పౌరసరఫరాలు, మున్సిపల్, రెవెన్యూ శాఖలు, వాటిలో వేలాదిమంది అధికారులు, లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరూ కూడా ప్రజలకు ఇటువంటి సేవలు అందించేందుకే ఉన్నారు. నెలనెలా ప్రభుత్వం వారి జీతాల కోసం రూ.3-5,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఇంత పటిష్టమైన వ్యవస్థ, ఇన్ని లక్షలమంది ఉద్యోగులు ఉండగా, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ త్రిశంకు స్వర్గంవంటి సచివాలయ వ్యవస్థను, దాని కింద మళ్ళీ లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థను సృష్టించింది. వీటి వలన ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతున్నప్పటికీ, వారందరినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం వాడుకొంటున్నందున వారికి వందల కోట్ల ప్రజాధనం ఈవిదంగా పంచిపెట్టేస్తోంది. మన న్యాయవ్యవస్థలు దీనిని తప్పు పడుతున్నాయే తప్ప వారించకపోవడంతో వాలంటీర్ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం కొనసాగించగలుగుతోందని చెప్పవచ్చు.
ఈ నిరర్ధక వ్యవస్థలను సృష్టించడమే కాకుండా తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వీటిని భరించకతప్పని పరిస్థితి కల్పిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోదని నారా లోకేష్ హామీ ఈయవలసిరావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.



