ఇది వరకు వైసీపి అధినేత జగన్ తన చెల్లి షర్మిలని తన రాజకీయ ప్రత్యర్ధులపైకి బాణంలా సందిస్తే ఆమె ఊహించని విదంగా రివ్వున దూసుకుపోయింది. కానీ గురి తప్పడమే కాకుండా రివ్వున తిరిగివచ్చి జగన్ గుండెల్లోనే గుచ్చుకుంది.
కానీ మాజీ వైసీపి ఎంపీ, ప్రస్తుత టిడిపి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సందించిన బాణం మాత్రం గురితప్పలేదు. నిజానికి ఆయన వేసింది బాణమని అనలేము. కొండకు వెంట్రుక కట్టి లాగే ప్రయత్నం చేస్తే ఊహించనివిదంగా ఆ కొండ కదలడం మొదలైంది.
ఇంతకీ స్టోరీ ఏమిటంటే, ఇదివరకు రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోవడం ఎందుకనుకున్నారో ఏమో, అక్రమాస్తుల కేసులలో ఏ-1గా ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని, దాదాపు 11 ఏళ్ళుగా అంతూపోంతూ లేకుండా సాగుతున్న ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలని, ఆ కేసుల విచారణని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసువిచారణ ఆయన ధర్మాసనానికే వచ్చింది. అయితే ఆ ధర్మాసనంలో ఏపీకి చెందిన సంజయ్ కుమార్ కూడా సభ్యుడిగా ఉన్నారు.
కనుక ఆయన అభ్యర్ధన మేరకు రఘురామ కృష్ణరాజు వేసిన ఈ కేసు విచారణని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రకటించారు.
ఈ కేసు విషయంలో తమ వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటు సీబీఐ తరపు వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జగన్ తరపు వాదిస్తున్న రంజిత్ కుమార్ ఇద్దరూ కోరడంతో డిసెంబర్ 2న ఈ కేసుపై తదుపరి విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు.
అంటే రఘురామ కృష్ణరాజు ప్రయత్నం ఫలిస్తోందన్న మాట! ఈ కేసుపై డిసెంబర్ 2న విచారణ జరిపినంత మాత్రన్న వెంటనే ఏదో జరిగిపోతుందని ఆశించలేము. కానీ తప్పకుండా ఈ కేసులో కదలికలు మొదలయ్యి వేగం పుంజుకోవచ్చు.
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు, ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్ దారులన్నీ ఒకటొకటిగా మూసుకుపోతున్న ఈ సమయంలోనే ఈ కేసులో కూడా కదలిక మొదలవడం దేవుడి స్క్రిప్ట్ కాకపోతే మరేమిటి?




