ఏమీ తెలియని వ్యక్తి చెప్పవచ్చు కానీ మరో వ్యక్తిపై ద్వేషంతో రగిలిపోతున్న వ్యక్తికి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించి చూపారు.
ఆనాడు చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత, రాజకీయ ద్వేషంతోనే ఆంధ్రుల కలల రాజధానిని అమరావతిని పాడుపెట్టేశారు. ఆ ద్వేషంతోనే పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయించి రివర్స్ టెండరింగ్తో బోలెడంత డబ్బు ఆదా అంటూ దానినీ నాశనం చేసేశారు.
ఆయనపై ద్వేషంతో ప్రజా వేదికని ఎలా ఉన్నది అలా కూల్పించేశారు. ఆ ద్వేషంతోనే పేదల కడుపులు నింపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మూయించేశారు. తనపై ద్వేషంతో రాష్ట్రానికి నష్టం కలిగించవద్దని చంద్రబాబు నాయుడు పదేపదే జగన్కు విజ్ఞప్తి చేస్తున్నా జగన్ పట్టించుకోలేదు.
చంద్రబాబు లేదా వైసీపి శ్రేయోభిలాషులు, మేధావులు చెపితే జగన్ వినకపోయి ఉండవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడైనా వినాలి కదా? కానీ వినలేదు.
జగన్ పోలవరం పనులు నిలిపివేయించి రివర్స్ టెండరింగ్కు వెళ్ళబోతున్నట్లు తెలియగానే, కేంద్ర జలశక్తి శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్కె జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి 2019, ఆగస్ట్ 16న ఓ లేఖ వ్రాశారు.
ఈ దశలో పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసి మళ్ళీ టెండర్లు పిలవడం మంచిది కాదని, ప్రాజెక్టు పనులు నిలిచిపోతే అపార నష్టం కలుగుతుందని, ఇంకా అనేక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. కనుక రివర్స్ టెండరింగ్ ఆలోచన విరమించుకొని, యధాతధంగా పనులు కొనసాగించవలసిందిగా ఆర్కె జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అయితే జగన్ ఇదంతా చంద్రబాబు నాయుడుపై ద్వేషం, కక్షతోనే చేశారా? అంటే మరో బలమైన కారణం కూడా ఉంది.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికే ఆయన బుర్రలో 2024 ఎన్నికలకు మరో పెద్ద ప్రణాళిక సిద్దం అయ్యింది. అది సంక్షేమ పధకాలని అందరికీ తెలుసు. కానీ మరో ప్రణాళిక గురించి బహుశః వైసీపిలో ఎవరికీ తెలిసి ఉండదు. అదే చంద్రబాబు నాయుడుని అడ్డుతొలగించుకోవడం!
2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో టిడిపి కనపడకుండా తుడిచిపెట్టేయాలంటే ముందుగా చంద్రబాబు నాయుడుపై అవినీతిపరుడనే ముద్రవేయడం చాలా అవసరమని జగన్ గట్టిగా నమ్మారు.
అందుకే ఆయన మొదలు పెట్టిన ప్రతీ పనిలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెపుతూ అన్ని పనులను నిలిపివేయించారు. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అనే ముద్ర వేసేందుకుఏ జైల్లో కూడా పెట్టారు.
గత 5 ఏళ్ళలో జగన్ చేసిన లక్షల కోట్ల అప్పులు సరిపోవన్నట్లు చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో, ఆయనను అవినీతిపరుడని నిరూపించి 2024 ఎన్నికలలో టిడిపిని దెబ్బ తీసేందుకు జగన్ చేసిన ఈ పనుల వలన రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం కలిగిందని చెప్పక తప్పదు.
అమరావతిని నిర్మించకుండా, విశాఖ రాజధాని ఏర్పాటు చేయకుండా 5 ఏళ్ళు కాలక్షేపం చేయడం వలన, రాష్ట్రంలో అరాచక వాతావరణ సృష్టించడం వలన, రాష్ట్రానికి రాకుండా పోయిన పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఎన్నో ఎవరికీ తెలీదు. ఆవిదంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం చాలా కష్టం.
ఒక వ్యక్తిపై ద్వేషంతో, రాజకీయ కక్షతో, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి?





