రాజకీయాలలో సింపతీ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ సింపతీ కూడా అన్ని వేళలా సానుకూల ఫలితాలను అందిస్తుంది అని చెప్పడానికి అవకాశం లేదు.
నాడు వైఎస్ఆర్ మరణం సందర్భంగా ఆయన తనయుడు వైస్ జగన్ కు, వైఎస్ఆర్ కుటుంబానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల నుండి భారీ ఎత్తున సింపతీ అందింది. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయ్యి దాదాపు 16 నెలలపాటు జైలు జీవితం అనుభవించారు.
ఇవన్నీ కలిపి వైస్ జగన్ కు ఆయన స్థాపించిన వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున సానుభూతిని తీసుకొచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ సింపతీ, సానుభూతి ద్వేషంగా మారడానికి కూడా పెద్దగా సమయం పట్టలేదని చెప్పాలి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో వైస్ జగన్ ను తెలంగాణ ప్రాంతంలో అడుగు కూడా పెట్టనివ్వలేకపోయింది వైఎస్ఆర్ సింపతీ అస్త్రం. అలాగే జగన్ అరెస్టుతో వైసీపీ కి దక్కిన సానుభూతి ఆయుధం 2014 ఎన్నికలలో వైసీపీ ని అధికారంలోకి తీసుకురాలేకపోయింది.
దీనితో అన్ని సమయాలలోను, అన్ని సందర్భాలలోనూ ఈ సానుభూతి అస్త్రం అధికారాన్ని అందించలేదని రుజువయ్యింది. ఉదాహరణకు తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లినా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అక్కడి ప్రజలు ఇదే మాదిరి ఆప్ పార్టీకి కేజ్రీవాల్ కి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో 2023 వైసీపీ ప్రభుత్వ హాయంలో అప్పటి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది. కానీ ఈ సమయంలో ఏపీలో బాబు పట్లే కాదు ఆయన పార్టీ టీడీపీ పట్ల కూడా ప్రజల్లో విపరీతమైన సానుభూతి వెల్లివెత్తింది.
వైసీపీ నియంత పోకడలతో ముందుకెళ్తుందని, వైస్ జగన్ కక్ష్య రాజకీయాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వైసీపీ అధికారంతో ప్రతిపక్ష టీడీపీ ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తుందంటూ అటు టీడీపీ పై ఇటు బాబు పై ఏపీ తో పాటు దేశ వ్యాప్తంగా సానుభూతి పవనాలు వీచాయి.
దానిఫలితమే టీడీపీ కూటమి 164 సీట్లతో, అఖండ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది. అయితే ఇదే మాదిరి జగన్ ను కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తే బాబు, టీడీపీ మాదిరే జగన్, వైసీపీ కూడా ప్రజలలో సింపతిని సాధిస్తుందని, తద్వారా రాబోయే ఎన్నికలలో అధికారాన్ని అందుకోవచ్చని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.
అయితే నాడు బాబు అరెస్టుతో టీడీపీ నిలబడలేదు, ఆ అరెస్టు అక్రమమని ప్రజలు విశ్వసించారు కాబట్టి టీడీపీ ని నిలబెట్టారు, బాబు కి పట్టం కట్టారు. ఇప్పుడు కూడా జగన్ అరెస్టు సహేతుకంగా లేకపోతేనే ప్రజల నుంచి వైసీపీ కి సానుభూతి లభిస్తుంది.
లేని పక్షంలో వైసీపీ కూడా ఆప్ మాదిరి జగన్ కూడా కేజ్రీవాల్ తహారలో ప్రజల నుంచి తిరస్కరణ ఎదుర్కోక తప్పదు . దీనిబట్టి చూస్తే నాయకుల అరెస్టులకు ప్రజలలో ఒక లెక్క ఉంటుందని, ప్రభుత్వం అరెస్టు చేసిన విధానం పట్ల ఒక స్పష్టత ఉంటుందనేది తేటతెల్లమవుతుంది. అందువల్ల అన్ని అరెస్టులు అధికారాన్ని ఇవ్వలేవని అన్ని రాజకీయ పార్టీల నాయకులు గ్రహించాలి.






