డికి లేచిందే పరుగు, దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగినట్లు అనే మాటలు తరచు వినబడుతూనే ఉంటాయి. ఈ రెండూ జగన్కు చాలా చక్కగా సరిపోతాయి.
జగన్ బుర్రలో ఏదైనా ఓ ఆలోచన రాగానే వెంటనే అమలుచేస్తుంటారు. మూడు రాజధానుల ప్రకటన, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇందుకు చక్కటి ఉదాహరణలు.
అలాగే ఏ పని ఎప్పుడు మొదలుపెట్టాలో తెలియక ఏదో చేసి నవ్వులపాలవుతుంటారు. విద్యుత్ చార్జీల పెంపు, ఫీజ్ రీ ఇంబర్స్మెంట్, వెన్నుపోటు దినం నిరసనలు ఇందుకు చక్కటి ఉదాహరణలు.
జగన్ అమరావతిని వద్దనుకొని మూడు రాజధానులో విశాఖ రాజధానో అనుకున్నారు కనుక ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆ పనులు మొదలుపెట్టి ఉండి ఉంటే ఎన్నికల నాటికి ఏదో ఒకటి చూపించగలిగేవారు.
కానీ 5 ఏళ్ళ సమయం వృధా చేసుకోవడంతో రుషికొండపై నిర్మించిన ప్యాలస్లు జగన్ అసమర్దతకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయాయి.
భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు నాయుడు (2014-19)నే భూసేకరణ చేసి అన్ని అనుమతులు సంపాదించిపెట్టారు. కనుక జగన్ ముఖ్యమంత్రికాగానే ఆ పనులు మొదలుపెట్టి పూర్తిచేసి ఉంటే ఎన్నికలలో కనీసం అదైనా ప్రజలకు చూపించుకోగలిగేవారు.
కానీ ఎన్నికలకు ముందు రెండోసారి శంకుస్థాపన చేసి అది పూర్తి కాకుండానే దిగిపోయారు. అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అదృష్టం కోల్పోయి, తాను అమితంగా ద్వేషించే సిఎం చంద్రబాబు నాయుడుకే ఆ క్రెడిట్ దక్కేలా చేసిపోయారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, చిత్తూరు జిల్లాలో బంగారుపాళెంలో మామిడి రైతులతో మాట్లాడేందుకు జగన్ బుధవారం బయలుదేరుతున్నారు.
ముందే చెప్పుకున్నట్లు దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగినట్లు, రాష్ట్రంలో మామిడి సీజన్ ముగుస్తుండగా ఇప్పుడు జగన్ వారి కష్టాలను తెలుసుకొనేందుకు బయలుదేరుతున్నారు.
ఏపీలో మార్చి, ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు మామిడి కాయలు, పళ్ళు సీజన్ ఉంటుంది. దానికి రెండు నెలలు ముందుగా వివిద రాష్ట్రాల నుంచి హోల్సేల్ పళ్ళ వ్యాపారులు, దళారులు వచ్చి రైతులతో మాట్లాడుకొని ధరలు ఖాయం చేసుకుంటారు. ఆ ప్రకారమే మామిడి దిగుబడి మొదలైనప్పటి నుంచి సీజన్ ముగిసే వరకు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
రాష్ట్రంలో ఇప్పటికే మామిడి సీజన్ చివరి దశకు వచ్చింది. ఇప్పుడు వారి కష్టాలను తెలుసుకోవాలని జగన్కు ఎవరు సలహా ఇచ్చారోగానీ బుధవారం బంగారుపాళెం బయలుదేరుతున్నారు.
ఇంత ఆలస్యంగా బయలుదేరుతునప్పటికీ జగన్ నిజంగానే మామిడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికే వెళితే చాలా సంతోషమే.
కానీ పరామర్శయాత్రల పేరుతో బలప్రదర్శన చేస్తూ దండయాత్రలు చేస్తున్నారు కనుక ఇది కూడా చిత్తూరు జిల్లాలో జగన్, పెద్దిరెడ్డి, రోజాల బలప్రదర్శన కోసమే అని వేరే చెప్పక్కరలేదు.




