కర్ణుడి ప్రాణాలకు ఎటువంటి ఆపద వాటిల్లకుండా కవచ కుండలాలు ఆయన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అయితే కర్ణుడికి ఆ కవచాలు పుట్టుకతోనే సంక్రమించాయి. అలాగే కర్ణుడు కూడా తన కవచాల అండతో ఎన్నడూ ప్రత్యర్థులతో సమరం చెయ్యలేదు.
కానీ, వైస్ జగన్ తానూ ఒక రాజకీయ నాయకుడిగా ఆవిర్భవించాలి అనుకునే ముందే తన రాజకీయ జీవితానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఎన్నో కవచాలను సిద్ధం చేసుకున్నారు. ఇందులో ముందుగా జగన్ ఎంచుకున్న కవచం ఆర్థిక బలం.
తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొన్ని తరాలకు సరిపడా ఆస్తులను పోగేసుకుని తన రాజకీయ జీవితానికి, తన రాజకీయ ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన కవచాన్ని సమకూర్చుకుని ఇప్పటికే దాన్ని అడ్డుపెట్టుకునే జగన్ రాజకీయం చేస్తున్నారు.
ఇక తండ్రి ఆకస్మిక మరణంతో తండ్రి లేని బిడ్డ అంటూ సింపతీ కవచాన్ని తయారు చేసుకున్నారు, అలాగే తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని మరో కవచంగా మార్చుకుని రాజకీయంగా ముందడుగు వేశారు. ఇక తానూ ఏర్పాటు చేసిన వైస్సార్ పార్టీని కాపాడుకోవడానికి, ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తల్లి విజయలక్ష్మిని, చెల్లి షర్మిలను మరో కవచంలా మార్చుకున్నారు.
అలాగే తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల నుండి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి అనే పదవిని మరో కవచంలా చేసుకుని, దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలను, ప్రభుత్వేతర వ్యవస్థలను (సోషల్ మీడియా) తనకు, తన పార్టీకి కవచంలా తయారు చేసుకున్నారు.
కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటేస్తుంది అనే సామెత మాదిరి జగన్ తన చుట్టూ, తన పార్టీ చుట్టూ ఇన్ని రకాల కవచాలను సిద్ధం చేసుకున్నప్పటికీ ప్రజలు నొక్కిన ఒకేఒక్క బటన్ ఈ కవచాలన్నిటిని పటాపంచలు చేసి వైసీపీ పార్టీని అధఃపాతాళానికి తొక్కి జగన్ ను నిషస్త్రుడిని చేసింది.
దీనితో ఇన్నాళ్లుగా జగన్ తనచుట్టూ వేసుకున్న రక్షణ కవచాలు ఒక్కొక్కటిగా చెల్లాచెదురవుతున్నాయి. బాబాయ్ వివేక హత్యతో తండ్రి లేని బిడ్డ అనే సింపతీ కవచం కాస్త కాటికెళ్లింది. రాజన్న రాజ్యం అంటూ రాక్షస రాజ్యం సృష్టించడంతో తండ్రి వారసత్వ కవచాన్ని కోల్పోయారు.
ఇక తండ్రి ఆస్తి కోసం తల్లి, చెల్లి మీద కోర్టుకెళ్లి వారి కవచాలను దూరం చేసుకున్నారు. జగన్ ఐదేళ్ల పాలన చూసిన ఏపీ ప్రజలు జగన్ కు ఇచ్చిన అతి పెద్ద కవచమైన ముఖ్యమంత్రి పదవిని లాగేసుకున్నారు. దీనితో నడి సముద్రంలో చిక్కుకున్న చుక్కానిలా జగన్ పరిస్థితి, వైసీపీ పార్టీ దుస్థితి దిగజారిపోయింది.
చేతిలో ఉన్న పదవి అనే కవచం, అధికారం అనే అస్త్రం దూరమవడంతో గత ఐదేళ్లు తన కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ కవచాలైన ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వేతర వ్యవస్థలు ఒక్కొక్కటిగా జగన్ చేజారి పోతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీసుకున్న బలమైన నిర్ణయాలతో జగన్ ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా కవచాన్ని బద్దలు కొట్టే పనిలో ఉన్నారు అధికారులు.
అలాగే 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ కి జగన్ ఏర్పాటు చేసుకున్న బలమైన కవచాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి 11 కు తెచ్చారు. ఇలా జగన్ తన సొంత రక్త సంబంధాల నుండి తన కోసం రక్తమైన చిందించగలిగే వారి వరకు తానూ ఏర్పాటు చేసుకున్న కవచాలన్నింటి కోల్పోతున్నారు.
అయితే ఇన్ని కవచాలను కోల్పోయినప్పటికీ వీటన్నిటిని తిరిగి పొందగలిగే ఒకేఒక్క కవచం ఆర్థిక బలం మాత్రం జగన్ నుండి ఎవ్వరు దూరం చేయలేకపోతున్నారు. అది నానాటికి దాని బలం పెంచుకుంటూ జగన్ ను, ఆయన పార్టీని అన్ని విధాలా కాపాడుతూ వస్తుంది.




