శివ కుమార్‌తో జగన్‌ భేటీ… అవసరమే!

dk-shiva-kumar-ys-jagan

జగన్మోహన్‌ రెడ్డి బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్‌తో సోమవారం రాత్రి భేటీ అయిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదివరకు ఆయనే షర్మిలని ఒప్పించి కాంగ్రెస్‌లో చేర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా నియమించింది.

ADVERTISEMENT

తాజా సమాచారం ప్రకారం, ఆమెను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించి, ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు తనకి అప్పగిస్తే వైసీపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని జగన్‌ ప్రతిపాదన చేసిట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను వైసీపి ఇంకా ధృవీకరించవలసి ఉంది.

జగన్‌ మొదటి నుంచి మోడీ, అమిత్ షాలకు విధేయంగా ఉన్నప్పటికీ, వారిప్పుడు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ఇక్కడ ఏపీలో బీజేపీ, అక్కడ ఢిల్లీ మోడీ ప్రభుత్వంలో టిడిపి భాగస్వాములుగా ఉన్నాయి. కనుక బీజేపీ ప్రత్యక్షంగా జగన్‌కు సహాయపడకపోవచ్చు.

ప్రస్తుతం జగన్, వైసీపి ఉన్న పరిస్థితులలో ఇక ముందు వారు ఎదుర్కొబోయే సమస్యలను అధిగమించాలంటే ఇటువంటి బలమైన జాతీయ పార్టీ అండదండలు చాలా అవసరమే. ముఖ్యంగా పక్కలో బల్లెంలా మారిన షర్మిల బెడద వదిలించుకోవాలంటే మరో మార్గం కనిపించడం లేదు. కనుక ఒకవేళ జగన్‌ శివ కుమార్‌తో భేటీ అయ్యి ఈ ప్రతిపాదన చేసినా ఆశ్చర్యం లేదు.

ఇక ఏపీ కాంగ్రెస్‌ విషయానికి వస్తే, షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ, ఆమె కనీసం కడప సీటుని కూడా గెలుచుకోలేకపోయారు. ఆమె తీరు పట్ల ఏపీ కాంగ్రెస్‌ నేతలు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వలన ఏపీలో కాంగ్రెస్‌ మళ్ళీ ఉనికి చాటుకున్నప్పటికీ, ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

ఇప్పటికే పదేళ్ళుగా ఏపీలో కాంగ్రెస్‌ కనబడకుండా పోయింది. ఏపీలో ఎప్పటికీ ఇలాగే టిడిపి, వైసీపిల మద్య అధికార బదిలీ అవుతూ ఉంటే, భవిష్యత్‌లో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించలేరు.

వైసీపి విషయానికి వస్తే అది ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ఏపీలో చాలా బలం ఉంది. బలమైన నాయకులు, నాయకత్వం కూడా ఉన్నాయి. వారిలో దాదాపు అందరూ కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారే. వారికి ఇప్పుడు వేరే దారి లేదు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలు కూడా చేస్తుండవచ్చు. అదే జరిగితే వైసీపి తుడిచిపెట్టుకుపోతుంది. జగన్‌ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది.

కనుక తానే వైసీపిని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా పగ్గాలు చేపడితే ఈ సమస్య నుంచి అందరూ బయటపడవచ్చు.

ప్రస్తుతం జగన్‌కు కాంగ్రెస్‌ అవసరం, కాంగ్రెస్ పార్టీకి జగన్‌ అవసరం ఉన్నాయి. కనుక ఈ ప్రతిపాదన నిజమే అయితే ఇదే జరుగవచ్చు.

కనుక కాంగ్రెస్‌లో వైసీపి విలీనం ప్రతిపాదన నిజమే అయితే ఏపీలో మళ్ళీ మరో సరికొత్త రాజకీయ ప్రయోగం మొదలైన్నట్లే!

ADVERTISEMENT
Latest Stories