శీతాకాల అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ బహిష్కరించింది. ఫిరాయింపులకు నిరసనగా సభను బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు. అయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంది? వాళ్లకు కావాల్సిన బిల్లులు ఆమోదించేసుకుని వెళ్లిపోయారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం దూరంగా ఉండిపోవడంతో విమర్శల పాలయ్యింది.
అయితే ఇప్పటికి జగన్ కు అసెంబ్లీకు వెళ్ళే ఉద్దేశం లేదట. నిన్న కనిగిరిలో మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్లాలంటే మనసు రావడం లేదని అన్నారు. చట్టసభలు చేసిన చట్టాలు ఈ పాలనలో అమలు కావడం లేదని ఆరోపించారు. చట్టాలను అవహేళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉందనీ, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకి పదవులు ఇవ్వడం గతంలో ఎక్కడా చూడలేదన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వెళ్లే ధైర్యం అధికార పార్టీకి లేదన్నారు. దీనిబట్టి జగన్ తన పాత పాటే పాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయనకు అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశమే లేన్నట్టు ఉంది. నిజానికి ఆయనకు నెల రోజులు పాదయాత్రకు బ్రేక్ ఇస్తే పాదయాత్ర ఎఫెక్ట్ పోతుందని, అదే సమయంలో పార్టీని సభలో లీడ్ చేసే అవకాశం వేరేవారికి ఇవ్వడానికి ఇష్టం లేదని కాబట్టే సభకు వెళ్లడం లేదని సొంత పార్టీ వారే అంటున్నారు. కొంతమంది ఏకంగా ఆయన సీఎంగానే సభలోకి వెళ్లాలనుకుంటున్నారని చెబుతున్నారు.



