దేశంలో ఎక్కడా లేని వ్యవస్థను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చాం, దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించాం అంటూ వాలంటీర్ వ్యవస్థను సృష్టించి గొప్పగా జబ్బలు చరుచుకున్న వైసీపీ ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థను కాలగర్భంలో కలిపేసింది.
తన రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను తన రాజకీయ అవసరాల కోసమే సమాధి చేసింది వైసీపీ. అయితే ఎన్నికలలో ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి, వృద్ధుల ప్రాణాలతో రాజకీయ చదరంగం ఆడడానికి ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకున్నాడు జగన్. అయితే ఈ వ్యవస్థలో లోపాలున్నాయని, ఇది సమాజానికి హానికరమని పవన్ వాలంటీర్ వ్యవస్థ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
ఆ ఆరోపణలను ఆసరాగా తీసుకుని వాలంటీర్లను అడ్డుపెట్టుకుని పవన్ మీద కేసులు మోపింది జగన్ ప్రభుత్వం. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ, తమను అవమానిస్తున్నారంటూ, తమ పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ పై వివిధ ప్రాంతాలలో కేసులు నమోదు చేసారు వాలంటీర్లు.
వచ్చేది మనమే…ఇచ్చేది మనమే…ఈ వ్యవస్థలో పని చేస్తుంది మన వాళ్ళే అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ ను నమ్ముకుని ఎన్నికల ముందు వైసీపీ నేతలు చెప్పిందే శాసనం , చేసిందే చట్టం అన్నట్టుగా కొంతమంది వాలంటీర్లు బాబు, పవన్ లపై రాజకీయ పరమైన ఆరోపణలు చేసి తమ రాజీనామా పత్రాలను మీడియా ముందుంచారు.
అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్టుగా ఎన్నికలలో జగన్ పోయి బాబు వచ్చాడు. ఇక వాలంటీర్ల కథ మళ్ళీ మొదటికొచ్చింది. అప్పుడు వైసీపీ నేతల బెదిరింపులకు లొంగి పోయి రాజీనామా చేయాల్సి వచ్చిందని, వచ్చేది జగనే మళ్ళీ మా ఉద్యోగాలు మాకిచ్చేస్తాడు అని నమ్మి మోసపోయామని మరికొందరు వినతి పత్రాలు పట్టుకుని బాబు, పవన్ ల వద్దకు వస్తున్నారు.
మమల్ని క్షమించండి…తెలియక చేసిన పొరపాటు…కావాలంటే వైసీపీ నేతల మీద కేసులు పెడతాం అంటూ కూటమి ప్రభుత్వంతో కాళ్ళ బేరానికి వస్తున్నారు వాలంటీర్లు. అయితే ఈరోజు జరిగిన కూటమి తొలి క్యాబినెట్ మీటింగ్ లో వాలంటీర్ వ్యవస్థ మీద ఒక నిర్ణయం తీసుకుంటారు అని ఎదురు చూసిన వాలంటీర్లకు నిరాశే మిగిలింది.
అయినా వాలంటర్లు రాజీనామా చేయడానికి భాద్యులు అప్పటి ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల ప్రచారంలో బాబు ఎవ్వరు రాజీనామా చెయ్యొద్దు అని పదేపదే చెప్పినప్పటికీ బాబు మాటలను బేఖాతరు చేస్తూ జగన్ కు వంత పాడిన ఈ వాలంటీర్లు ఇప్పుడు తమను నమ్మించి నట్టేట ముంచిన జగన్ ను వదిలి పెట్టి పవన్, బాబుల చుట్టూ తిరగడం ఎంత వరకు న్యాయం.?




