హైదరాబాద్, బెంగళూరు, పులివెందుల, తాడేపల్లిలో వందల కోట్లతో విలాసవంతమైన భవనాలు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, ఓ పేద కుటుంబం జీవించేందుకు సెంటు భూమిలో నిర్మించిన ఇల్లు సరిపోతుందని నిర్ణయించారు. ఒక సెంటు అంటే 48.4 చదరపు గజాలు మాత్రమే.
అది 4-5 మంది ఉండే ఓ కుటుంబానికి ఎలా సరిపోతుందనుకున్నారో తెలీదు కానీ సెంటు భూమి పేరుతో సెంటిమెంట్ రగిలించి ఓట్లు దండుకుందామనుకున్నారు. తాను వద్దనుకున్న అమరావతిని తాను అధికారంలో రాలేకపోయినా ఎవరూ నిర్మించకుండా ఉండేందుకు రాజధాని ప్రాంతంలోనే సెంటు భూములు ఫ్లాట్స్ వేసి పంచేశారు కూడా. సెంటు భూమి పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు అదనం.
అయితే టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిఎం చంద్రబాబు నాయుడు ఈ సెంటు భూముల భాగోతంపై విచారణ జరిపిస్తూనే, ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు భూమిని పేదలకు కేటాయించాలని నిర్ణయించారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల చొప్పున ఆర్ధిక సాయం కూడా అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గతంలో టిడిపి హయాంలో నిర్మించుకున్న ఇళ్ళకు జగన్ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ఆ బకాయిలను కూడా చెల్లించాలని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇదివరకు టిడిపి హయాంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6-7 లక్షల టిడ్కో ఇళ్ళు నిర్మించింది. వాటికి జగన్ ప్రభుత్వం వైసీపి రంగులు వేయించుకుంది కానీ మిగిలిన పనులు పూర్తి చేయలేదు. లబ్ధిదారులకు కేటాయించలేదు. సిఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వాటి పరిస్థితి తెలుసుకున్నారు.
వాటికి వేసిన వైసీపి రంగులు తొలగించాలంటే మళ్ళీ వేల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఆ అదనపు భారం వద్దనుకుని వాటిని అలాగే లబ్ధిదారులకు కేటాయించేస్తే, ఆ క్రెడిట్ వైసీపి తీసుకుతుంది. కనుక టిడ్కో ఇళ్ళపై వైసీపి రంగులను ఉంచాలా తొలగించాలా అనే దానిపై సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటె ఒకేసారి లక్షల ఇళ్ళు పేదలకు లభిస్తాయి.
జగన్ 5 ఏళ్ళ పాలనలో ఒక మంచి పని చేయకపోగా, అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఈవిదంగా రాష్ట్రానికి ఆర్ధిక నష్టం కలిగిస్తూనే ఉన్నారు. అయినా అందరికీ మేలు చేశానని, తన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని నిసిగ్గుగా చెప్పుకోవడం ఆయనకే చెల్లు.




