నిన్న పవిత్రమైన రాఖీ పండగను రెండు తెలుగు రాష్ట్రాలలో సోదరసోదరీమణులు చాలా సంతోషంగా జరుపుకొన్నారు. అయితే ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం తమ అన్నకు చాలా దూరంగా ఉండిపోయారు. వారే వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి.
నిన్న రాఖీ పండగనాడు వైఎస్ షర్మిల వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర చేసుకొంటుండగా, సునీతారెడ్డి తనకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాఖీ పండగనాడు ఇద్దరు చెల్లెమ్మలు జగనన్నకి దూరంగా ఉండిపోయారు…. అని అనే కంటే దూరమయ్యారని చెప్పుకోవచ్చు.
కారణాలు ఏవైనప్పటికీ వైఎస్ షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని ఒంటరిగా పాదయాత్రలు చేసుకొంటున్నారు. ఒంటరిపోరాటం చేస్తున్న కూతురుకి అండగా ఉండాలని చెపుతూ విజయమ్మ కూడా వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. ఏపీలో జగనన్న సంక్షేమ రాజ్యంలో ఆమె కాలుపెట్టలేరు. అలాగే తెలంగాణలో కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీని కాదని చెల్లెమ్మకు తోడుగా జగనన్న నిలవలేరు. కనుక ఎవరిదారి వారిదే అని స్పష్టమైంది.
“నేను విన్నాను… నేనున్నాను, “ అని గొప్పగా చెప్పుకొనే జగనన్న మూడున్నరేళ్ళు గడిచిపోయినా తన తండ్రి హంతకులను పట్టుకొని శిక్షించలేకపోయారనే బాధతో సునీతారెడ్డి తనకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె కూడా జగనన్నపై నమ్మకం కోల్పోయారని అర్దమవుతూనే ఉంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారంటూ ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా సిఎం కేసీఆర్ కుటుంబంలో ఎవరినీ దూరం చేసుకోలేదు. ఏపీలో జగన్ ప్రభుత్వంపై అటువంటి ఆరోపణలు లేనప్పటికీ ఉన్న ముగ్గురినీ ఈవిదంగా దూరంగా చేసుకొన్నారు.



