2019లో అధికారం చేపట్టిన నాటి నుండి పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టి ‘పంపకాలు’ చేస్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ శుక్రవారం నాడు మరో 10 పది వేల పంపకానికి సిద్ధమయ్యారు. ‘వాహనామిత్ర’ పేరుతో లబ్ధిదారులకు 10 వేల రూపాయల బటన్ ‘నొక్కడానికి’ సీఎం గారు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అయితే ఇదేమి ఈ ఏడాది నుండి ప్రారంభమైన పధకం కాదు. గత రెండేళ్లుగా సీఎం చేస్తోన్న ‘బటన్ నొక్కుడు’ పథకమే గానీ, ఇందులో ఉన్న ట్విస్ట్ లను లబ్ధిదారులు ఇప్పుడిప్పుడే తెలుసుకోవడం ప్రారంభించారు. ఇలా ఓ చేత్తో బటన్ నొక్కుతూ 10 వేలు ఇస్తోన్న జగన్, అవే పది వేలను మరో చేత్తో తీసుకుంటున్నారన్న నిరుత్సాహం ప్రజల్లో పెరిగిపోతోంది.
ఉదయం పూట పది వేలు వేస్తూ, సాయంత్రం నుండి ఆర్టీవో అధికారుల కేసుల ద్వారా గానీ, పోలీసుల కేసుల ద్వారా గానీ తిరిగి అవే పదివేలు తీసుకోవడమే కొసమెరుపు. తొలి రెండేళ్ళల్లో ఈ విషయాన్ని గ్రహించలేకపోయిన ప్రజలు, ఇప్పుడు మాత్రం జగన్ చేస్తోన్న మాయను అర్ధం చేసుకోగలుగుతున్నారు.
ఈ విషయంలో తొలి ఏడాది జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఇలా ‘వాహన మిత్ర’ పేరుతో కొంతమందికి 10 వేల రూపాయలను మంజూరు చేసిన సీఎం జగన్, ఆ మరుసటి రోజే డీజిల్ సుంకం పేరుతో అదనంగా లీటర్ కు 2 రూపాయలను వాహనదారులందరి నెత్తిన వేసారు. ఇది కేంద్ర పెంపుతో నిమిత్తం లేకుండా రాష్ట్రం మాత్రమే పెంచిన సుంకం.
ఇందులో మర్మమేమిటో నాడు గ్రహించలేని లబ్ధిదారులకు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది జగన్ పోకడ అర్ధమవుతూ వస్తోంది. దీంతో శుక్రవారం నాడు ఉదయం 10 వేలు పడుతున్నాయంటే, సాయంత్రమో, మరునాడో వాహనదారుల నుండి ‘రిటర్న్ గిఫ్ట్’ తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లే భావించాలి.
‘అమ్మ ఒడి’ పేరుతో ఇస్తూ, ‘నాన్న బుడ్డి’తో దోచుకుంటున్నాడని ప్రతిపక్షాలు జగన్ పధకాలపై గత కొన్నేళ్లుగా గళమెత్తి చెప్తోన్న విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పధకాలు ‘ఆయారామ్ – గయారామ్’ అన్న నానుడిని నిజం చేస్తున్నారన్నది తేటతెల్లమవుతోన్న విషయం.



