2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపి హాయిగా 5 ఏళ్ళు పాలించి 2024లో జరిగే ఎన్నికలకు వెళ్ళవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే 2024లో జరిగే ఎన్నికల కోసం వేట ప్రారంభించేసి, ఈ నాలుగన్నరేళ్ళుగా తీవ్ర ఆందోళనతో, తీవ్ర అభద్రతాభావంతో బాధపడుతూనే గడుపుతోంది.
2024 ఎన్నికల కోసం సంక్షేమ పధకాలు మొదలుపెట్టింది. వాటి కోసం ఎడాపెడా అప్పులు చేసింది. అప్పుల కారణంగా ఆర్ధిక పరిస్థితి తలక్రిందులు అవుతుండటంతో ప్రజలపై పెను భారం మోపుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. దాంతో వారు ఆందోళనలు చేస్తే నయన్నో భయాన్నో అదుపులో ఉంచుకోవలసి వస్తోంది.
రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టి లబ్దిదారులుగా పిలుచుకొంటున్న ఓటరు మహాశయులకు క్యాలండర్ ప్రకటించి, క్రమం తప్పకుండా బటన్ నొక్కి మరీ లక్షల కోట్లు పంచిపెడుతున్నా వారినీ నమ్మలేని పరిస్థితి!
ఎందుకంటే, చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు… జనాలు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా బిరబిర పరుగులు పెట్టి వెళుతుంటారు. వారికి జేజేలు పలుకుతుంటారు. రాష్ట్రంలో 97 శాతం ప్రజలు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని జగన్ చెప్పుకొంటుంటే, వారందరూ వెళ్ళి చంద్రబాబుకి, లోకేశ్కి, పవన్ కళ్యాణ్కి తమ కష్టాలు చెప్పుకొని కన్నీళ్ళు పెట్టుకొంటుంటారు! ఇలాంటి జనాలను ఎలా నమ్మగలం?
కనుక చివరాఖరు అస్త్రంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్లతో సహా అందరిపై కేసులు పెట్టి లోపల వేసేస్తే జనాలు మనం చెప్పిన మాటలనే వింటారు. మన భజనే చేస్తారని అనుకొన్నారో ఏమో లోపల వేసేసి జనాలకు మరో ఆప్షన్ లేకుండా చేశామని స్వీట్లు పంచుకొన్నారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకొన్నారు.
కానీ చంద్రబాబు నాయుడుని, టిడిపి నేతలను లోపల వేసినా ఈ జనాలు మనకే ఓట్లు వేస్తారో సానుభూతితో టిడిపిని చంకనెత్తుకొంటారో?అనే అనుమానం వైసీపిని ఇంకా పీడిస్తున్నట్లుంది. అందుకే విశాఖ రాజధాని, విశాఖ మెట్రో అనే రెండు కొత్త ఎపిసోడ్స్ ప్రారంభిస్తున్నారు.
2024 ఎన్నికల కోసం సంక్షేమ పధకాలు, వాటి కోసం గడప గడపకు, వైసీపి రంగులు, స్టిక్కర్లు, కేసులు, చంద్రబాబు నాయుడు అరెస్ట్, మూడు రాజధానులు, విశాఖ రాజధాని, మెట్రో… ఇలా వైసీపి ప్రయత్నించని వ్యూహం లేదంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ వింటే రాజుగారు ఏడు చేపల కధ గుర్తుకు రాకమానదు. అయినా చివరికి ఏడో చేప ఎండనే లేదు కదా?వైసీపి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.



