మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అనే మాట రాష్ట్రంలో వినబడుతోంది. నిజానికి ఆ పేరుతో జరిగిన రాజకీయాలు, పార్టీల డ్రామాలను చూసిన ఆంధ్ర ప్రజలు ‘ప్రత్యేక హోదా’ గురించి ఆలోచించడం ఎప్పుడో మానుకున్నారు.
హటాత్తుగా ఆంధ్రాలో ఊడిపడిన వైఎస్ షర్మిల, ఇప్పుడు ఆ పేరుతో మళ్ళీ ఆంధ్రా ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగించి, దానిని బ్రతికించుకుని, దాని సాయంతో తన రాజకీయ జీవితాన్ని పునర్నిర్మించునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్దమవుతూనే ఉంది.
కానీ ఆంధ్రా ప్రజలకు నమ్మకం కలగాలంటే ‘ప్రత్యేక హోదా… ప్రత్యేక ప్రత్యేక హోదా…’ అని గొంతు చించుకుంటే సరిపోదు. కాస్త డ్రామా అవసరం. దానిని రక్తి కట్టించాలి కూడా! అందుకే వైఎస్ షర్మిల ఫిబ్రవరి 2న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్ష చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చి అన్ని జిల్లాలోను దీక్షలు ధర్నాలు మొదలుపెట్టవచ్చు.
అయితే ఈ దీక్షలతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందా?అంటే రాదనే తెలుసు. వచ్చే మాటైతే గతంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి దీక్షలు చేసినప్పుడే వచ్చేసి ఉండేది. రానప్పుడు ఈ వ్యర్ధ ప్రసంగాలు, దీక్షలు దేనికంటే ముందే చెప్పుకున్నాము.
ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. అది భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అయిపోతోంది కూడా. కనుక కేంద్రంలో మళ్ళీ మోడీ నేతృత్వంలో బీజేపీయే అధికారంలోకి వస్తుంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని లోక్సభలోనే మోడీ ప్రభుత్వం పలుమార్లు నిష్కర్షగా చెప్పేసింది. కనుక కాంగ్రెస్ అధికారంలోకి రాదని, మోడీ ఇవ్వరని తెలిసి ఉన్నప్పుడు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా పేరుతో చేస్తున్న ఈ కొత్త పోరాటాలు, చెపుతున్న మాటలున్నీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలే కదా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకుని ఆదరించారు. అయినా ఏనాడూ వారిని గౌరవించలేదు పైగా వారి అభీష్టానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విడగొట్టింది కూడా. ఆ పాపాలే ఇంకా తీరలేదు. ఇప్పుడు వైఎస్ షర్మిలని ఏపీకి పంపించి, పార్టీని బ్రతికించుకునేందుకు ‘ప్రత్యేక హోదా’ పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్దపడుతోంది.
ఇప్పుడు షర్మిల, రేపు కేసీఆర్ రావచ్చు. ప్రతీసారి ఇలా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఓ కొత్త డ్రామా ఆడుతూనే ఉన్నారు. కనుక ఎవరో ఏదో చెపితే వారి మాయ మాటలు నమ్మి మోసపోతూనే ఉందామా?ఒకసారి మోసపోతే అమాయకత్వం. రెండోసారి కూడా మోసపోతే అజ్ఞానం. మూడోసారి కూడా మోసపోతే అవివేకమే కదా?
కనుక ఏపీ ప్రజలు ఈ ప్రత్యేక హోదా ఉచ్చులో చిక్కుకుంటే అది ఎలాగూ రాదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలు చించిన విస్తరి అవుతుందని గుర్తుంచుకోవాలి.




