వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి, చెల్లికి నోటీసులు ఇచ్చి వారికి ఆస్తులలో వాటాలు ఇవ్వబోనని చెప్పడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకునేలా చేస్తోంది.
జగన్ నిన్న విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించినప్పుడు, “ఇటువంటి గొడవలు ప్రతీ ఇంట్లో ఉండేవే” అని తేలికగా కొట్టిపడేసేందుకు ప్రయత్నించారు. మీ ఇళ్ళలో ఇటువంటి గొడవలు లేవా? అని ప్రజలను ఎదురు ప్రశ్నించారు.
సిఎం చంద్రబాబు నాయుడు పనిగట్టుకొని తమ ఫోటోలతో వార్తలు వ్రాయిస్తూ తనపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ కుటుంబ వ్యవహారాల గురించి కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తే బాగుంటుందని జగన్ హితవు పలికారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన చెల్లి వైఎస్ షర్మిల స్వయంగా స్పందిస్తూ, “ఆస్తుల కోసం కీచులాడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఆవిదంగా చేయాలనుకుంటే నాకు అన్యాయం చేసినప్పుడే చేసి ఉండేదాన్ని కదా?
ఇప్పుడు కూడా నేను అడగలేదు. మా అన్నయ్యే మాకు ఆస్తులలో వాటాలు ఇవ్వబోమని ట్రిబ్యూనల్లో పిటిషన్ వేశారు. మాకు నోటీస్ ఇచ్చారు. కానీ నేనేదో ఆస్తుల కోసం రాద్దాంతం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు.
ఆయనే కోర్టుకి వెళ్ళారు. మమ్మల్ని కోర్టుకి ఈడ్పించాలని చూస్తున్నారు. చేసిందంతా చేసి ఇది చాలా చిన్న విషయం ప్రతీ ఇంట్లోని ఆస్తుల గొడవలు ఉంటాయని చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది. తల్లిని, చెల్లినీ ఎవరైనా కోర్టుకి ఈదుస్తారా? కానీ మా అన్న జగన్ ఆ పని చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు కదా జగనన్నయ?అని అన్నారు. వైఎస్ షర్మిల స్వయంగా ఈ విషయాలు బయటపెడుతున్నప్పుడు, మద్యలో సిఎం చంద్రబాబు నాయుడుని జగన్ నిందించడం దేనికి?
ఈ ఆస్తుల పంపకాలలో ఈ పోరాటాలతో వైఎస్ కుటుంబ ప్రతిష్ట దెబ్బ తింటుందని వేరే చెప్పక్కరలేదు. బహుశః అందువల్లే ఆనాడు వైఎస్ షర్మిల మౌనంగా తెలంగాణకి వెళ్ళిపోయారని అనుకోవచ్చు.
పేర్నినాని చెప్పిన లెక్కల ప్రకారం జగన్ స్వార్జితమైన సరస్వతి, భారతీ కంపెనీలలో వైఎస్ షర్మిల వాటాలు కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ వాటిని కూడా తమ తండ్రి వైఎస్ కష్టార్జితం నుంచి వచ్చిన సొమ్ముతోనే ఏర్పరచుకున్నారని విజయమ్మ, షర్మిల వాదిస్తున్నారు.
తల్లీ, చెల్లి-కొడుకుల మద్య మొదలైన ఈ ఆస్తుల పంచాయితీ ఎప్పుడు ఏవిదంగా ముగుస్తుందో కానీ ఆలోగా జగన్, వైసీపిలకి రాజకీయంగా భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది.




