తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప శాసనసభ సమావేశాలకు హాజరుకానని మారాం చేస్తున్న చాక్లెట్ బాయ్ జగన్కు ‘వెళ్ళకపోతే మీకా ఎమ్మెల్యే పదవులు ఎందుకు? రాజీనామా చేసేయమని’ చెల్లి షర్మిల ఉచిత సలహా ఇచ్చింది.
నిన్న తాడేపల్లి ప్యాలస్లో సమావేశంలో విలేఖరులు ఇదే చెప్పగా, “ఇప్పుడు చెల్లి టాపిక్ తేవొద్దు. ఆమె ప్రతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో కేవలం 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. ఏపీలో అసలు ఉనికేలేని కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె మాటలు పట్టించుకోనవసరమే లేదు,” అని జగన్ సమాధానం ఇచ్చారు.
అన్న వ్యాఖ్యలపై షర్మిల మళ్ళీ ఘాటుగా స్పందిస్తూ, “అవును మా పార్టీకి 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. మా పార్టీలో ఎవరూ ఎమ్మెల్యేగా ఎన్నికవలేకపోయారు కనుక శాసనసభ సమావేశాలలో పాల్గొనలేకపోతున్నాము. కానీ మీకు 11 మంది ఎమ్మెల్యేలున్నా కుంటిసాకులు చెపుతూ శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా తప్పించుకుంటున్నారు.
అటువంటప్పుడు మీకు 38 శాతం వచ్చినా మాకు 1.7 శాతమే వచ్చిన మన రెండు పార్టీలకు తేడా ఏముంది? మీరు శాసనసభకు వెళ్ళరు… మేము వెళ్ళలేము అంతే తేడా!
కనుక వైసీపి వంటి అల్పమైన పార్టీకి ప్రజలు వేసిన ఓట్లు అన్నీ వృధా అయిపోయిన్నట్లే. కాదనుకుంటే తక్షణం శాసనసభకు వెళ్ళి సభలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయండి.
శాసనసభకు వెళ్ళేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ముఖ్యం కాదు. ఓ ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలని మాట్లాడాలనే నిబద్దత, ధైర్యం అవసరం.
మీరు తాడేపల్లి ప్యాలస్లో ఎంపిక చేసిన మైకులను ముందేసుకొని మాట్లాడటం గొప్ప కాదు. శాసనసభకు వెళ్ళి మైకు ముందు మాట్లాడండి.
మీకు చాతకాకుంటే, ధైర్యం లేకపోతే తక్షణమే మీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేసేయండి. మీకు బదులు శాసనసభకు వెళ్ళే ధైర్యం ఉన్నవారిని ప్రజలు ఎన్నుకుంటారు,” అని షర్మిల అన్నారు.
షర్మిలకి అన్నతో రాజకీయాలు, ఆస్తుల గొడవలను పక్కనపెట్టి చూస్తే ఆమె చెప్పిన మాటలు నూటికి నూరుశాతం నిజమని ఎవరికైనా అర్దమవుతుంది. కానీ జగన్ ఒక్కరికే అర్దం కావడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటూ మారాం చేస్తూనే ఉన్నారు.




