కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కవితను షర్మిలను పోలుస్తూ కథనాలు ప్రచారమవుతున్నాయి. అయితే అసలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇద్దరు ఒక్కటే సమస్యను ఎదుర్కొన్నారా.? అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం.
ముందుగా కవిత విషయానికి వస్తే, ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా మొదలైన తెరాస పార్టీ పోరాటం చివరి దశలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత జాగృతి ఫౌండేషన్ పేరుతో తన తొలి అడుగు వేసింది. అయితే ఇక్కడ తెరాస బలోపేతానికి కానీ, తెరాస ఉద్యమాలలో కానీ కవిత పోషించిన పాత్ర చాల పరిమితం.
అలాగే తెరాస పార్టీ కర్త, కర్మ, క్రియ అన్ని కేసీఆరే, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు, పార్టీ ఓటమిని చూసినప్పుడు కవిత పార్టీ బాధ్యతను ఎన్నడూ భుజానకెత్తుకోలేదు. తెరాస లో కేసీఆర్ అధ్యక్ష స్థానంలో ఉంటే నాడు ఆయన ఆ తరువాత స్థానంలో హరీష్ రావు ఉండేవారు. కేసీఆర్ కష్టంలో, పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు భుజం కాసింది హరీష్ రావు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత, తన తండ్రి కష్టం మీద ఏర్పడిన ప్రభుత్వంలో కవిత ఎంపీ గా తొలి గెలుపును అందుకున్నారు. అయితే ఆ తరువాత ఎన్నికల్లో ఓటమి చెందిన కవిత చివరికి ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకున్నారు. అయితే బిఆర్ఎస్ కవిత రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడింది కానీ కవిత బిఆర్ఎస్ ఎదుగుదలకు ఊతమివ్వలేదు.
కానీ షర్మిల విషయానికొస్తే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వైఎస్ఆర్ రాజకీయ వారసురాలిగా కాకుండా జగనన్న వదిలిన బాణం లా రాజకీయ అరంగేట్రం చేసిన షర్మిల, జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి దాదాపు 16 నెలలు జైలుకెళ్తే వైసీపీ పార్టీ బాధ్యతలను పూర్తిగా భుజాన మోసింది.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 3 వేల కిమీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన షర్మిల వైసీపీ కి జగన్ లేని లోటు లేకుండా చేసారు. అయితే ఆ ఎన్నికలలో వైసీపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో, తన అన్నను ముఖ్యమంత్రిని చేయాలనే తన ఆశయం కోసం మరో ఐదేళ్లు వైసీపీ పార్టీ ప్రచార కర్తగా జగన్ కు కుడి భుజమయ్యింది.
అయితే ఈ పదేళ్ల వైసీపీ ప్రస్థానంలో షర్మిల ఎన్నడూ జగన్ నుంచి ఎటువంటి రాజకీయ పదవి పొందలేదు. కేవలం ఒక పార్టీ కార్యకర్త మాదిరి జగన్ ఆదేశాలను తూచాతప్పకుండా అనుసరిస్తూ జగన్ గెలుపులో వైసీపీ అధికారంలో భాగమయ్యింది. అయితే ఇక్కడ “షర్మిల వైసీపీకి బలమైతే, వైసీపీ కి మాత్రం షర్మిల భారమయ్యారు”.
ఇక ఏపీలో అన్నతో రాజకీయ యుద్ధం చేయలేక తెలంగాణ లో వైస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి, అక్కడి నుంచి ఆడ పిల్ల కాదు ఈడ పిల్లను అంటూ తిరిగి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పుట్టింటికి చేరుకుని వైస్ జగన్ తో అలుపెరుగని యుద్ధం చేస్తున్నారు షర్మిల.
అయితే ఇక్కడ షర్మిల రాజకీయ జీవితం ఎప్పుడు “ముళ్ళ మీద నడక” మాదిరే కొనసాగింది. కానీ కవిత రాజకీయ జీవితం “గులాబీ పూల మీద బాట” మాదిరో సాఫీగా సాగిపోయింది. షర్మిల కావాలని కోరుండి జగన్ తో విభేదించలేదు, తన రాజకీయ స్వార్ధం కోసం అన్న పై ఆధిపత్య పోరు కు కాలుదువ్వలేదు. తండ్రికి వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టలేదు. మరి కవిత.?




