కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల ప్రభుత్వానికి చేసిన ఒక సూచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా పేరును గత ప్రభుత్వం వైస్సార్ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే కడప అంటే “దేవుని తొలి గడప” అనే సంప్రదాయం అక్కడి ప్రాంత ప్రజలలో మెండుగా ఉంది. అలాగే కడప జిల్లాను శ్రీ వేంకటేశ్వర స్వామి గడప గా కూడా స్థానికులు భావిస్తారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కడప పేరును పూర్తిగా తొలగిస్తూ దాని స్థానంలో తన తండ్రి వైఎస్ఆర్ పేరును జోడించి దానిని వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు వైస్ జగన్.
అయితే నాడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చెయ్యలేక, నాటి ముఖ్యమంత్రి వైస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం లేక ఆ ప్రాంతవాసులు కూటమి ప్రభుత్వ రాక తో వైస్సార్ జిల్లా పేరును పునః పరిశీలించాలంటూ అభ్యర్ధనలు చేసుకున్నారు.
దీనితో రాజకీయంగా తన పార్టీ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ పేరును తొలగించకుండానే, స్థానిక ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ వైస్సార్ జిల్లాను ‘కడప వైస్సార్ జిల్లా’గా పేరు మారుస్తూ అధికారిక జీవో విడుదల చేసారు సీఎం చంద్రబాబు.
అయితే వైస్సార్ కుమార్తెగా బాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించిన షర్మిల ప్రభుత్వానికి మరొక సూచన చేసారు. ఎన్టీఆర్ జిల్లాను కూడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు షర్మిల. అయితే షర్మిల డిమాండ్ లో రాజకీయ విమర్శే తప్ప లాజిక్ లేదనేది ఆమె గ్రహించాలి.
కడప పేరుతో జిల్లా ఏర్పాటు అనేది ఈనాడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పటి నుంచో ఉన్న కడప జిల్లా పేరును గత ప్రభుత్వం తన రాజకీయ స్వార్ధానికి మార్పు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం అక్కడి ప్రాంత ప్రజల మనోభావాలకు విలువనిస్తూ కడప పేరును తిరిగి తీసుకొచ్చింది.
కానీ విజయవాడ పేరుతో ఇప్పటి వరకు జిల్లా అనేది లేదు. గతంలో కృష్ణ జిల్లాలో విజయవాడ అనేది ఒక నగరంగా ఉండేది. అలాగే ఆ జిల్లా హెడ్ క్యార్టర్ కూడా మచిలీపట్నంగా ఉండేది. కానీ ఇప్పుడు మచిలీపట్నం కృష్ణ జిల్లా కిందకు రాగా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో అంతర్బాగమయ్యింది.
ఈ అంశాలన్నిటినీ పరిగణలోనికి తీసుకుని ఆలోచిస్తే ” విజయవాడ ఎన్టీఆర్ జిల్లా” అనే షర్మిల వాదనలో బలమే కాదు భావం కూడా లేదనేది స్పష్టమవుతుంది. అయితే ఈ విజయవాడ, ఎన్టీఆర్ పేరు మీద మరికొన్ని ప్రతిపాదనలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి, కృష్ణమ్మ నది ఒడ్డున ఉన్న విజయవాడను కృష్ణ జిల్లాగానే ఉంచాలనే డిమాండ్ కూడా ప్రచారంలో ఉంది. మరి కూటమి ప్రభుత్వం విజయవాడ, ఎన్టీఆర్ విషయంలో పేరు మార్పుకు ముందుకొస్తుందా.? లేదా యధావిధిగా కొనసాగిస్తుందా అనేది చూడాలి.




