వివేకానందరెడ్డి హత్యకేసును విచారణ జరుపుతున్న సీబీఐకి సుప్రీంకోర్టు జూన్ నెలాఖరువరకు గడువు విధించినప్పటికీ, నోటీసు-బెయిలు-హైకోర్టు-సుప్రీంకోర్టు మద్యనే సైకిల్ చక్రంలా గిరగిరా తిరుగుతోంది తప్ప మూడు నెలలుగా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది.
నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నప్పుడు వారిని అడ్డుకోవలసిన సీబీఐ చేతులు కట్టుకొని చూస్తుంటే, వివేకా హత్య కేసులో న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతూ నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలులో ఉన్న భాస్కర్ రెడ్డికి, ఆయన కుమారుడు అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను, కేసు విచారణను ప్రభావితం చేస్తారని, కనుక వారిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని వాయించే సీబీఐ అధికారులు, వారు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే స్పందించరు.
అప్పుడు సునీతారెడ్డే మళ్ళీ పూనుకొని వారికి బెయిల్ మంజూరు చేయవద్దని పిటిషన్ వేసి పోరాడుతుంటారు. నిజానికి ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చేసే బాధ్యత సీబీఐదే కానీ ఆమెది కాదు. అసలు ఆమె ఈ కేసులో కలుగజేసుకోవలసిన అవసరమే లేదు. కానీ సీబీఐ చేతులు ముడుచుకొని చూస్తుండటంతో సీబీఐ చేయవలసిన న్యాయపోరాటాన్ని ఆమె చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పుడు, సీబీఐ వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని అందరూ భావించారు. కానీ చేయకపోవడంతో మళ్ళీ ఆమె పూనుకొని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లోనే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరికీ ఈ నేరంతో ప్రత్యక్షంగా సంబంధం ఉందని పేర్కొందని కానీ సీబీఐ అభియోగాలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని ఆమె సుప్రీంకోర్టు దృష్టికీ తీసుకువెళ్ళారు. కనుక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టుని అభ్యర్ధించారు. రేపు అంటే బుదవారం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆమె పిటిషన్పై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఒకవేళ సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, ఓ వారం పదిరోజుల తర్వాత సీబీఐ మేల్కొని, విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీస్ పంపిస్తుంది. అప్పుడు ఆయన మళ్ళీ ఏదో సాకుతో విచారణకు హాజరుకాకుండా మరో వారంపది రోజులు సెకండ్ ఎపిసోడ్ నడిపిస్తారు.
ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులోనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తారు. ఆ విచారణ పూర్తవడానికి మరో పదిరోజులు. ఈలోగా సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ఢిల్లీ వెళ్ళి, మోడీ, అమిత్ షాలతో భేటీ అవుతారు.
గత మూడు నెలలుగా ఈ కేసు ఇలాగే సాగుతోంది. కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ రానంతవరకు సునీతా రెడ్డి ఎన్ని కోర్టులు చుట్టూ తిరిగినా బహుశః ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ సీబీఐకి ఉండవలసిన పోరాటపటిమ ఆమెకు ఉండటమే విశేషం.





