వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామాతో మరో అధ్యాయం ముగిసిపోయింది. అన్న కోసం వైఎస్ షర్మిల అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు 3,000 కిమీలకు పైగా పాదయాత్ర చేసి వైసీపీని బలోపేతం చేశారు. ఆమెను జగనన్న వదిలిన బాణం అని ప్రత్యర్ధులు చెప్పుకొనేవారంటే ఆమెకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్దమవుతుంది.
కనుక జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి రాగానే మొట్టమొదటగా ఆమెకే చాలా కీలకమైన మంత్రి పదవి ఇస్తారనుకొంటే అటువంటి ఆలోచనే చేయలేదు. అన్న ఈవిదంగా చేస్తాడని బహుశః ఆమె కూడా ఊహించి ఉండరు. అయితే ఏనాడూ ఆమె అన్న గురించి, తమ మద్య విభేధాల గురించి బయట మాట్లాడలేదు. మౌనంగా నిష్క్రమించి తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టుకొని మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టారు.
ఆమె పార్టీ పెట్టుకోవడానికి సిద్దపడుతున్నట్లు తెలిసినా జగన్ ఆమెను వారించలేదు. మంత్రి పదవి ఇవ్వలేదు. ఆమె మంత్రి పదవి ఇవ్వనందుకే అన్నకు దూరమయ్యారా లేక వేరేవైనా కారణాలున్నాయా? అనేది పక్కన పెడితే, తనకు తెలంగాణ రాష్ట్రంలో బొత్తిగా ఆదరణ లేదని, రాదని తెలిసి ఉన్నా వేరే గత్యంతరం లేక అక్కడే పార్టీ పెట్టుకొని బలోపేతం చేసుకొనేందుకు ఒంటరిగా కృషి చేస్తున్నారు.
తాను కష్టకాలంలో ఉన్నప్పుడు కొండంత అండగా నిలబడిన చెల్లికి కనీసం ఇప్పుడూ జగన్ తోడ్పడటంలేదు. ఎందుకంటే, తెలంగాణ సిఎం కేసీఆర్తో సమస్యలు కొనితెచ్చుకోవడం ఇష్టంలేక కావచ్చు. కనుక వైఎస్ షర్మిల తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్నారు.
ఆంధ్రాలో వైసీపీ బలపడటానికి రెండు ప్రధాన కారణాలు. వైఎస్సార్కున్న అపూర్వ ప్రజాధారణ. ఆయన అకాల మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతి.
ఓదార్పు యాత్రల ద్వారా ఆ సానుభూతి పునాదుల మీద జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్మించుకొన్నారని అందరికీ తెలుసు. అయితే విజయమ్మ లేనిదే ఆ సానుభూతి లేదు. పార్టీ లేదు! కనుక వైసీపీకి పడిన పునాది కింద ఆమె అనుభవించిన మానసిక క్షోభ, ఆవేదన, శ్రమ కూడా ఉన్నాయని చెప్పక తప్పదు.
కానీ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు అధికారంలో నిలద్రొక్కుకోగానే ఇప్పుడు తల్లిని కూడా బయటకు సాగనంపారు. “నా వలన ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పార్టీ వీడుతున్నాను” అని విజయమ్మ ప్లీనరీలో ఎంతో బాధతో చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. ఆమె పార్టీని వీడుతున్నట్లు చెప్పగానే ప్లీనరీలో వైఎస్సార్ అభిమానులు కంటతడిపెట్టారు. కానీ జగన్ నిర్వికారంగా ఉండిపోయారు.
కానీ ఓ తల్లిగా ఆమె మాత్రం కొడుకు గౌరవ ప్రతిష్టాలను కాపాడాలనే ప్రయత్నించారు. పదవిలో నుంచి, పార్టీలో నుంచి బయటకు పంపించబోతున్నారని తెలిసి ఉన్నప్పటికీ ప్లీనరీకి హాజరయ్యి కొడుకు గౌరవం నిలిపారు. తాను తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్న కూతురు వైఎస్ షర్మిల కోసమే పార్టీ వీడుతున్నానని ప్లీనరీలో సర్దిచెప్పుకొన్నారు. కన్న కొడుకే తనను పార్టీలో నుంచి బయటకు పంపిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నెపం వాటిపైకి తోసేసే ప్రయత్నం చేశారు. ఎంతైనా తల్లి కదా… కొడుకుపై ఈగ వాలకుండా కాపాడుకొనేందుకు చివరి వరకు గట్టి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. కానీ ఆమె పార్టీ వీడటం వెనుక వాస్తవం ఏమిటో అందరికీ తెలుసు.
తల్లీ చెల్లితో ఇంత నిర్ధయగా వ్యవహరించిన వ్యక్తి రాష్ట్రంలో తల్లులను, చెల్లులను ఉద్దరిస్తానంటే నమ్మగలమా?



