రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
కానీ జగన్ వచ్చాక మూడు రాజధానులతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యం అనే పాట మొదలుపెట్టి, చివరికి విశాఖతో ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి సాధ్యం అంటూ ముగించారు.
ఉత్తరాంధ్రా జిల్లాల కోసం 5 ఏళ్ళలో జగన్ ఏమీ చేయకపోయినా, తన కోసం ఋషికొండపై రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలస్లు నిర్మించుకున్నారు.
జగన్ తన అసూయాద్వేషాలు, రాజకీయ కక్షలు, వైసీపి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సృష్టించిన ఈ గందరగోళం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేకపోగా అన్ని రంగాలలో వెనుకబడిపోయింది.
చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ఈ గందరగోళానికి చెక్ పెట్టి అమరావతి నిర్మాణ పనులకు సన్నాహాలు మొదలుపెట్టారు.
రాజధాని ఎక్కడ ఉంటే అక్కడే అభివృద్ధి సాధ్యం అనే వైసీపి నేతల వితండవాదనలకు చెక్ పెడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఆచరణలో చేసి చూపుతున్నారు.
మంత్రి నారా లోకేష్ నేడు శాసనసభలో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకి ఎప్పుడూ కట్టుబడే ఉంది. 2014-2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెనుకబడిన రాయలసీమ జిల్లాలలో కియా వంటి పరిశ్రమలు, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేయించారు.
ఉత్తరాంధ్రా జిల్లాలలో ఐటి, పోర్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ ప్రాజెక్ట్, తాజాగా మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్, ఇంకా పలు పరిశ్రమల ఏర్పాటుకి కృషి చేస్తున్నాము.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని నేను యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాము. కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాము.
వ్యవసాయ ఆదారిత ఉభయగోదావరి, జిల్లాలలో ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, డెయిరీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాము. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ట్రాన్స్పోర్ట్, హోటల్ ఇండస్ట్రీస్ వగైరాలను రప్పించేందుకు కృషి చేస్తున్నాము,” అంటూ రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి ఏవిదంగా చేస్తున్నామో చక్కగా వివరించారు.
పాలకులకు ఇంత స్పష్టత, అవగాహన, దూరదృష్టి ఉంటే చాలు ఏ రాష్ట్రమైన శరవేగంగా అభివృద్ధి సాధిస్తుంది… అని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపబోతున్నారు.




