ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ప్రసారం అవుతుంది గనుక ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయమంటే ఎలా ఉంటుంది? అసలు ఇలా ఎవరైనా అడుగుతారా? ఇంత అజ్ఞానంగా ఎవరైనా మాట్లాడతారా? అంటే… అందరి సంగతి ఏమో గానీ, ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు మాత్రం ఇదే తీరున, ఇంతే అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేస్తూ, నవ్వులపాలవుతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ముఖ్యమా? పదవ తరగతి పరీక్షలు ముఖ్యమా? అంటే తమకు మాత్రం మ్యాచ్ లే ముఖ్యం అన్న చందంగా వ్యాఖ్యలు చేస్తూ మీడియా వర్గాలలో హల్చల్ చేస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిలయమైన అసెంబ్లీ సమావేశాల కంటే కూడా జగన్ పాదయాత్రే ముఖ్యమంటూ వైసీపీ నేతలు వింత వితండ వ్యాఖ్యలు చేయడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. మరీ విడ్డూరం కలిగించే అంశాలు ఏమంటే… జగన్ పాదయాత్ర ఉందని తెలిసి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిందంటూ వ్యాఖ్యలు చేయడం… వారి పరిజ్ఞానానికి, అవగాహనకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పాలి.
ఈ సందర్భంగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో జగన్ గురించి ఓ అసలు విషయం ప్రజలకు తెలిసివచ్చింది. “ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జగన్ పాదయాత్ర చేస్తున్నారని” వైసీపీ నేతలు స్వయంగా వ్యాఖ్యానించడంతో, ఇప్పటివరకు జగన్ కు ప్రజా సమస్యలు తెలియదన్న విషయాన్ని వారే పరోక్షంగా చెప్తున్నారు. ఒక రకంగా ఆలోచిస్తే… వారు చేసిన వ్యాఖ్యలు కూడా నిజమనిపించకమానవు.
నిజంగా జగన్ కు ప్రజా సమస్యలు తెలిస్తే… అసెంబ్లీ సమావేశాలలో పాల్గొని ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసే వారు కదా! ఇలా అసెంబ్లీ సమావేశాలను ‘బాయ్ కాట్’ చేసి ఉండేవారు కాదు కదా! అలా చేయడం లేదు అంటే… రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవా? అంటే ఖచ్చితంగా ఉన్నాయి… మాకే తెలియదు అని వారు చెప్తున్నట్లే కదా! అంటే రాష్ట్రంలో మూడున్నర్రేళ్ళ పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నా… కనీస ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? కనుక జగన్ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకోవడమే కరెక్ట్!
కనీస ప్రజా సమస్యలు తెలియని ఈ నాయకుడేనా ఇంతకాలం “నన్ను ముఖ్యమంత్రిని చేయండి” అని అడుగుతోంది అంటే…. దానికి ‘గప్ చుప్’గా ఉండాల్సిందే మరి!


