ఇదివరకు జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, హైదరాబాద్లో ఐటి ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, “మీ పంచాయితీలు మీ రాష్ట్రంలో చేసుకోండి. ఇక్కడ చేస్తే సహించబోము,” అని హెచ్చరించారు. అందుకు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అది వేరే విషయం.
కానీ వైసీపీ నేతలు ఈడీ లేదా సీబీఐ విచారణకు హాజరైనప్పుడు వైసీపీ శ్రేణులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. పొరుగు రాష్ట్రం లేదా విదేశాలలో మనం హద్దులు దాటితే ఎలాగూ అక్కడ కేసులలో చిక్కుకుంటారు. అంతకాదు… రాష్ట్రం పరువు మంట గలుస్తుందని చాలా మంది గ్రహించరు.
జగన్ తాజా ప్రతిపాదన ‘మావిగన్’ని ఆక్షేపిస్తూ ఏబీఎన్ ఆంద్రజ్యోతి కధనం ప్రసారం చేసింది. బహుశః జగన్ సూచన మేరకు వైసీపీ నేతలందరూ హైదరాబాద్ వెళ్ళి ఏబీఎన్ ఆంద్రజ్యోతి ధర్నా చేశారు. కొందరు లోనికి ప్రవేశించబోతే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మద్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి.
తెలంగాణ పోలీసులు తమతో అనుచితంగా వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరోపించారు. అలాంటి పరిస్థితి కల్పించుకున్నందుకు సిగ్గుపడాలి కానీ అక్కడా తమకు అవమానం ఎదురైందని వాదిస్తున్నారు. అయితే వైసీపీ నేతల హైదరాబాద్ దండయాత్ర వెనక వేరే వ్యూహం ఉందా?అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య అనేక సమస్యలు, వివాదాలు ఉన్నాయి. హైదరాబాద్లో వైసీపీ నేతలు హడావుడి చేసి కొత్త సమస్యలు సృష్టిస్తే?ఎవరికి లాభం? ఎవరికి నష్టం?అని ఆలోచిస్తే వారు పైకి చెప్పే కారణానికి మించి మరేదో ఉందని సందేహం కలుగుతోంది.




