కులాలను అడ్డుపెట్టుకుని సమాజమే తలదించుకునేలా హీనమైన చర్యలకు పాల్పడడమే వైసీపీ రాజకీయ సిద్ధాంతమా అనేంతలా వైసీపీ నానాటికి దిగజారిపోతోంది. ఇంతకన్నానా అన్న ప్రతిసారి తన దిగజారుడు రాజకీయాలను తెరమీదకు తెస్తూనే ఉంది వైసీపీ.
తాజాగా బోరుగడ్డ విషయంలో వైసీపీ ప్రత్యక్షంగా ఎక్కడ అతనికి, అతని కుటుంబానికి మద్దతు ప్రకటించలేదు. అయితే బోరుగడ్డ మాత్రం తానూ బాబు, పవన్, లోకేష్ ల మీద అద్దులు దాటి చేసిన విమర్శలకు వైసీపీ నేతల ఆదేశాలే కారణం అంటూ నేరం మొత్తం వైసీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే బోరుగడ్డ గొంతు విప్పితే వైసీపీ బూతు రాజకీయం బయటపడుతుంది అనే భయంతో వైసీపీ నేతలు బోరుగడ్డ భార్యకు అనధికార మద్దతు ప్రకటిస్తూ ఆమెను మీడియా ముందుకు తెస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతుంది. నా భర్తకు ఎటువంటి హాని జరిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అంటూ కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు మౌనిక.
తన భర్త ఎప్పుడు పవన్ కుటుంబం మీద కానీ బాబు మీద కానీ ఎటువంటి నీచమైన ఆరోపణలు చెయ్యలేదని, తాము దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులం కాబట్టే మా పై ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని సుద్దపూస కబుర్లు చెపుతున్నారు బోరుగడ్డ భార్య మౌనిక.
తన భర్త బోరుగడ్డ అనిల్ కేసు విషయంలో న్యాయం జరిపించమని జాతీయ ఎస్సి కమిషన్ ను ఆశ్రయించినట్లు మౌనిక మీడియాకు తెలిపారు. తన భర్తకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వం మీద న్యాయపోరాటం చేయడనికి తానూ సిద్ధం అంటూ ప్రకటించారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న భర్త అనిల్ నేరం మొత్తం వైసీపీ నేతలదే అంటుంటే ఇక్కడ ఉన్న భార్య మాత్రం వైసీపీ పార్టీ మీద కానీ ఆ పార్టీ నేతల మీద కానీ ఒక్క విమర్శ కూడా చేయడం లేదు.
దీని బట్టి ఇన్నాళ్లు భర్తను అడ్డుపెట్టుకుని రాజకీయం పేరుతో రాక్షసత్వం చేసిన వైసీపీ ఇప్పుడు కులం కార్డు బయటకు తీసి భార్యతో రాజకీయం మొదలుపెట్టినట్లు ఉంది. వైసీపీ రాజకీయానికి ఎవ్వరైనా ఓకే నా? అనే అభిప్రాయానికి సాధారణ ప్రజలు సైతం వచ్చారు. అసలు బోరుగడ్డ అనిల్ జైలుకు వెళ్ళడానికి కారణమైన వైసీపీ ని వదిలేసి కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయడంలో అర్థమేమిటి.?
కూటమి నేతల మీద, వారి కుటుంబాల మీద బోరుగడ్డ అనిల్ చేసిన నీచమైన వ్యాఖ్యలు ఇప్పటికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా తన భర్త అమాయకుడని, ప్రభుత్వం తనను విడిచి పెట్టాలని మౌనిక మీడియా ముందుకు రావడం వెనుక వైసీపీ రోత రాజకీయమే కారణం అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న మాట.




