ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఇంచుమించు ఓకే నమూనా ప్రకారం సాగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే రెండు రాష్ట్రాలలో వాటి అధినేతలపై కేసులు కూడా ఇంచుమించు ఓకే దశలో సాగుతుండటం మరో విశేషం.
వైసీపీ అధినేత ఏపీ డీజీపీని, పోలీసులను గూండాలు, మాఫియా గ్యాంగులతో పోల్చుతూ తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరినీ గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతానని బెదిరిస్తుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ రాష్ట్ర డిజీపిని, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేవిదంగా బెదిరిస్తున్నారు.
జగన్ అనుచిత వ్యాఖ్యలను ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించగా, కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వైసీపీ గోపిరెడ్డి ఖండించారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ‘డీప్ ఫేక్ వీడియో’తో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగా, అక్కడ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ‘డీప్ ఫేక్ వీడియో’ కూడా ప్రత్యక్షమైంది.
ఇక్కడ జగన్, అక్కడ కేటీఆర్ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రులను ఉద్దేశించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. వారి పార్టీల సోషల్ మీడియాలో చాలా ఉదృతంగా దుష్ప్రచారం జరుగుతోంది.
వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓకే నమూనాలో చేస్తున్న ఈ రాజకీయాలు, భవిష్యత్లో అన్ని పార్టీలకు ఓ ‘ఫార్మాట్’గా రెడీగా అందుబాటులో ఉంటాయి కనుక ఎవరూ పెద్దగా శ్రమ పడనవసరం లేకుండా దానిని ఫాలో అయిపోతే చాలు. కానీ ఈ ఫార్మాట్ రాజకీయాలకు ఓ ముగింపు కూడా ఉంది. అదే కేసులు-జైలు.
ఇక్కడ ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ కొలిక్కివస్తుంటే, అక్కడ ఫోన్ టాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు కొలిక్కి వస్తున్నాయి. త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో ఆ కేసుల నివేదికలు ప్రవేశపెట్టి చర్చించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కనుక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తే పరవాలేదు కానీ ఇటువంటి ‘నమూనా రాజకీయాలు’ చేయడం చాలా ప్రమాదకరమని చెప్పక తప్పదు.




