ముంగిట్లోకి ముప్పు తెచ్చుకొని సంబరాలా… పాపం వైసీపి!

Andhra-Pradesh-YS-Jaganమాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నేడు ఏపీ బంద్‌కు టిడిపి పిలుపునిచ్చింది. గత మూడు రోజులుగా టిడిపి ముఖ్యనేతలను గృహ నిర్భందంలో ఉంచినప్పటికీ, టిడిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేసినప్పటికీ నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు స్వచ్ఛందంగానే బంద్‌ పాటిస్తుండటం గమనిస్తే, చంద్రబాబు నాయుడు పట్ల జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు కూడా నిరసిస్తున్నారని స్పష్టమవుతోంది.

చంద్రబాబు నాయుడుని జైలుకి పంపినందుకు మంత్రి రోజావంటివారు స్వీట్లు పంచుకొని సంబరపడ్డారు. మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన కొందరు మంత్రులు కూడా తమ ఆనందాన్ని దాచుకోలేకపోతున్నారు. వైసీపి నేతలు పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారని వారు గ్రహించిన్నట్లు లేదు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించామని వైసీపి నేతలు సంతోషపడుతున్నారే కానీ వైసీపి ముంగిట్లో ముప్పు తెచ్చి పెట్టుకొన్నామని ఎవరూ గ్రహించిన్నట్లు లేదు.

వైసీపి చేసిన ఈ ఒక్క పనితో రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయి. ముఖ్యంగా టిడిపితో పొత్తులు పెట్టుకోవాలా వద్దా అని ఇంకా డైలమాలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మరో ఆలోచన చేయకుండా తన సినిమా షూటింగ్స్ నిలిపేసుకొని హైదరాబాద్‌ నుంచి తరలివచ్చి చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపారు.

ఆయనను విమానంలో విజయవాడ రాకుండా ఏపీ పోలీసులు ఆపాలని ప్రయత్నిస్తే, కారులో రోడ్డు మార్గంలో వచ్చారు. జగన్ ప్రభుత్వం ఆరాచకాల గురించి, రాజకీయ కక్ష సాధింపుల గురించి పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడారో అందరికీ తెలుసు.

ఇప్పుడు బీజేపీ పెద్దలు కూడా వెనకేసుకొని రాలేని పరిస్థితి జగన్ చేజేతులా కల్పించుకొన్నారు. కనుక బీజేపీ కూడా జనసేనతో కలిసి టిడిపితో పొత్తుకి సిద్దపడటమో లేదా జనసేనను వదులుకొని ఏపీలో ఒంటరిగా మిగిలిపోవడమో తేల్చుకోవాలసిన పరిస్థితిని కూడా జగన్ స్వయంగా కల్పించిన్నట్లయింది.

యువగళం పాదయాత్రతోనే టిడిపి యువనేత నారా లోకేష్ చాలా రాటుతేలారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం జైలుకి పంపడం ద్వారా ఈ కష్టకాలంలో నారా లోకేష్ టిడిపిని ముందుండి నడిపించి తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొనే అవకాశం కూడా వైసీపియే కల్పించిన్నట్లయింది.

ఇంతకాలం టిడిపి చేసిన రాజకీయపోరాటా లన్నీ ఒక ఎత్తైతే, ఇక నుంచి చేయబోయే పోరాటాలు మరో ఎత్తవుతాయి. ఈసారి ఎన్నికలలో వైసీపిని ఓడించి అధికారంలోకి ప్రతీకారం తీర్చుకోవాలనే కసిని టిడిపి శ్రేణుల్లో అణువణువు రగిలించింది కూడా జగన్ ప్రభుత్వమే.

ఇంత చేసినా చంద్రబాబు నాయుడుని ఎన్ని రోజులు జైలులో ఉంచగలదు?హైకోర్టు లేదా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసేవరకు మాత్రమే. అంటే చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించి వైసీపి కొరివితో తల గోక్కొనేందుకు సిద్దపడినప్పటికీ పైశాచికానందం తప్ప మరేమీ సాధించలేదని స్పష్టమవుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories