వై నాట్ 175 , రాష్ట్రంలో ప్రతిపక్షం లేని ప్రభుత్వం అంటూ విర్రవీగిన వైసీపీ 2024 ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయి నిజంగా ఏపీలో ప్రతిపక్షం లేని కూటమి ప్రభుత్వానికి మార్గం వేసింది.
నాటి నుంచి నేటి వరకు వైసీపీ విపక్ష ప్రయాణం ను ఒక్కసారి పరిశీలిస్తే, 151 నుంచి 175 కి వెళ్లాలనే వైసీపీ అత్యాశ చివరికి 11 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో వైసీపీ ఊహించని పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక పార్టీ ఓడిన తొలినాళ్లలో వైసీపీ నాయకుల వ్యక్తిగత విషయాలు వైసీపీ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. ఆ పార్టీ నెంబర్ 2 గా చెప్పబడే విజయ సాయి రెడ్డి, శాంతిల వివాదం మొదలుకుని దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురిల నడిరోడ్డు పంచాయితీల వరకు వైసీపీ పరువు బజారునపడింది.
ఇక అటుపిమ్మట ఏపీలో వచ్చిన వరద బీభత్సానికి వైసీపీ స్పందించిన తీరు, ఆ పార్టీ అధినేత వైస్ జగన్ అందించిన కోటి విరాళ సాయం వైసీపీ చిన్న మనస్సుని పెద్దగా ఆవిష్కరించింది.
అలాగే గత ఐదేళ్ల వైసీపీ పాపాలకు శిక్షలు అనుభవిస్తున్న వైసీపీ నేతలను అందగాళ్లుగా, సౌమ్యులుగా చిత్రీకరిస్తూ వైసీపీ ఒక అందమైన కుటుంబం అనేలా ప్రచారం చేసుకున్నారు. ఇక పార్టీ మద్దతుదారుల పరామర్శలతో బలప్రదర్శనలు చేస్తూ రాష్ట్రంలో హింసను ప్రోత్సహించే రాజకీయానికి తెరలేపారు.
అధికారులను బట్టలూడదీస్తా అంటూ బెదిరించడం, టీడీపీ నేతలను రప్ప రప్ప నరుకుతాం అంటూ భయపెట్టడం, గంజాయి ముఠాలను చిన్నపిల్లలు అంటూ వెనకేసుకురావడం, కేసులకు భయపడకండి సోషల్ మీడియాలో రెచ్చిపోండి అంటూ పార్టీ క్యాడర్ ను రెచ్చకొట్టడం…ఇలా వైసీపీ తన గత ఐదేళ్ల విధ్వంసాన్ని మరో ఐదేళ్లు కొనసాగించిందేకు ప్రణాళికలు రచిస్తుంది.
ఇక రాజధాని అమరావతి మీద నీచ రాజకీయాలు చేయడం, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ప్రయత్నాలు కొనసాగించడం, శవ రాజకీయాలతో చెలరేగిపోవడం, అసెంబ్లీ కి రాకుండా మీడియాలో కూర్చుని కాలక్షేపం చేయడం, రోడ్ల మీకు వచ్చి అలజడి వాతావరణాన్ని సృష్టించడం, పాస్టర్ ప్రసాద్ సాధరణ మరణాన్ని హత్యగా అసాధారణ రీతిలో ప్రచారం చెయ్యడం,
సింగయ్య అనే వైసీపీ కార్యకర్త అసాధారణ మరణాన్ని ప్రమాదంగా మలచడం, దాని పై కుట్ర కోణాలు ఉన్నాయంటూ ప్రభుత్వాన్ని నిందించడం, జిత్వాని కేసులో ఐఏఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారులను నిందితులుగా మార్చడం…ఇలా వైసీపీ గత ఏడాది గా ప్రతిపక్షంలో ఉంటూ కూడా తన సొంత డిఎన్ఏ ను వదులుకోవడం లేదు.
అలాగే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నుంచి దేవాదాయ శాఖల భూముల దోపిడీ వరకు అన్ని అంశాలలోను వైసీపీ ప్రజలకు జవాబుదారిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పై నిందలు వేస్తుంది, ప్రభుత్వ పెద్దల పై ప్రశ్నలను సంధిస్తోంది.
ఇలా వైసీపీ ఏడాది ప్రతిపక్ష ప్రయాణంలో రాష్ట్రానికి లబ్ది చేకూరేలా కానీ, ప్రజలకు ప్రయోజనం అందించేలా కానీ చేసిన కార్యక్రమం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.



